ఏర్పాట్లు పూర్తి భీంపూర్, జూన్ 27: ప్రభుత్వం జూలై ఒకటో తేదీ నుంచి చేపట్టనున్న హరితహారం కార్యక్రమా నికి పంచాయతీలు సిద్ధమవుతున్నాయి. భీంపూర్ మండలంలో 26 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీ నర్సరీలో ప్రస్తుతం 10,000 చొప్పున మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి మొత్తంగా 2.60 లక్షల మొక్కలు నాటి సంరక్షించే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో వినోద్, ఈజీఎస్ ఏపీవో సంగీత, ఈసీ నరేందర్ నిత్యం కొన్ని నర్సరీలను సందర్శిస్తు న్నారు. ఇప్పటికే సర్పంచ్లు ,కార్యదర్శులు చేపట్టిన గ్రేడింగ్, షిఫ్టింగ్ ,గుంతలు తవ్వే పనులను పరిశీలిస్తున్నారు. రైతులు,కూలీలకు ఉపాధి మునుపటిలా కాకుండా గత ఏడాదినుంచి ప్రభుత్వం ప్రతి పంచాయతీకో నర్సరీని స్థానికంగానే ఏర్పాటు చేసి హరితహారంలో స్థానికులకు అవసరమైన మొక్కలు అందజేసింది. గ్రామాలకు జిల్లా కేంద్రాలనుంచి మొక్కలు తెప్పించుకునే ఇబ్బంది తప్పింది. రోడ్ల పక్కన ఎవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ హాళ్లు, బడులు, అంగన్వాడీలు లాంటి సర్కారు కార్యాలయాలతో పాటు ప్రైవేట్ కార్యాలయాల ఆవరణల్లో మొక్కలు నాటి సంరక్షించారు. చేల గట్లపై రైతులు వరద నియంత్రణకోసం వెదురు,టేకు లాంటి మొక్కలు నాటి కాపాడుకున్నారు. మండలంలో నిపాని , కరంజి(టీ), అంతర్గాం తదితర గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో నర్సరీలు నిర్వహిస్తుండగా ఇంకొన్ని చోట్ల రైతులు తమ చేలలో నర్సరీలు ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు. ఇలా ప్రతి రోజు నర్సరీల్లో రైతులు, కూలీలకు రూ.245 చొప్పున ఈజీఎస్ ద్వారా చెల్లిస్తున్నారు. వేసవిలో, ఇతర సందర్భాలలో పనులు లేనపుడు కూడా రైతులు,కూలీలు ఇలా నర్సరీల ద్వారా ఉపాధి పొందుతున్నారు. పూర్తయిన గ్రేడింగ్ పనులు కరంజి(టీ),నిపాని, గోముత్రి ,అంతర్గాం, భీంపూర్ అందర్బంద్ పంచాయతీల్లో ఇప్పటికే సర్పంచులు,కార్యదర్శులు నర్సరీలలో గ్రేడింగ్,( ఒకే జాతి మొక్కలను సైజులను బట్టి ఒక వరుసలో పేర్చటం ), గుంతలు తవ్వేపనులు పూర్తిచేశారు. ఇక ప్రభుత్వం హరితహారం ఆరంభించిన తరువాత జీపీలు మొక్కలను నిర్ణీత ప్రదేశాలలో నాటటమే తరువాయి. అలాగే పంచాయతీ నర్సరీల్లో పండ్లు, పూల మొక్కలు అందుబాటులో ఉండడంతో ఇంటింటికీ వాటిని అందజేయనున్నారు. కోరిన రైతులకు చేలగట్లలో నాటడానికి టేకు, వేప మొక్కలు అందజేయనున్నారు. గత హరితహారంలో నాటిన మొక్కల్లో 85 శాతం సంరక్షించామని అధికారులు చెప్తున్నారు.