నమస్తే తెలంగాణనెట్వర్క్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాయి. మంగళవారం ఊరూరా సంబురాలు నిర్వహించగా, పండుగ సందడి కనిపించింది. టీఆర్ఎస్ కార్యాలయాలు, ప్రధాన చౌరస్తాల్లో ప్రభుత్వ విప్ సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకానితోపాటు ఎమ్మెల్యేలు దివాకర్రావు, చిన్నయ్య, ఆత్రం సక్కు, రామన్న, రేఖానాయక్, జడ్పీ అధ్యక్షులు పార్టీ జెండాలను ఎగురవేసి జై తెలంగాణ నినాదాలు చేశారు. కేక్లు కట్ చేసి.. మిఠాయిలు పంపిణీ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఆచార్య జయశంకర్సార్ చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని, ఆయన చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని నేతలు కొనియాడారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాలలోని హమాలీవాడలో టీఆర్ఎస్ జెండాను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఎగురవేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి.. జై తెలంగాణ నినాదాలు చేశారు. మందమర్రి పట్టణంలోని బీ1 కార్యాలయం వద్ద, రామకృష్ణాపూర్లోని సూపర్ బజార్ చౌరస్తాలోని టీఆర్ఎస్ కార్యాలయంలో చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకానితో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని, ఇక్కడి సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల వారు అనుసరిస్తున్నారని కొనియాడారు.
సీసీసీ నస్పూర్లోని యూనియన్ కార్యాలయం వద్ద టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి కేక్ కట్ చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ గులాబీ జెండా విజయానికి చిహ్నమని, పేద,బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ కృషి చేస్తున్నదన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ సారథ్యంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పరిమి సురేశ్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్నగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జోగు రామన్న వేడుకలను ఘనంగా నిర్వహించారు. నార్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నారు.