ఇచ్చోడ, డిసెంబర్ 26 : మండల కేంద్రంలోని జడ్పీ సెకండరీ పాఠశాలలో పోలీస్ ఉద్యోగం కోసం ఆదివారం నిర్వహించిన ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. మండలంలోని వివిధ గ్రామాల్లోని 267 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 258 మంది పరీక్షకు హాజరయ్యారు. తొమ్మిది మంది గైర్హాజరయ్యారు. ప్రవేశ పరీక్ష తీరును సీఐ రమేశ్బాబు, ఎస్ఐ ఉదయ్ కుమార్ పరిశీలించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శిక్షణ తరగతులతో పాటు భోజన వసతి సదుపాయం కల్పిస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
ఇంద్రవెల్లిలో..
ఇంద్రవెల్లి, డిసెంబర్ 26 : మండల కేంద్రంలోని సన్షైన్ పాఠశాలలో ఎస్ఐ నందిగామ నాగ్నాథ్ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగం కోసం యువతీ యువకులకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ రాత పరీక్షకు 200 మంది హాజరయ్యారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సిరికొండలో..
సిరికొండ, డిసెంబర్ 26 : మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఏఎస్ఐ ప్రకాశ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తీర్ణత సాధించిన వారికి పోలీసుల ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో రెండు నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆయన వెంట కానిస్టేబుళ్లు అర్షద్, ప్రకాశ్ ఉన్నారు.
భీంపూర్లో..
భీంపూర్, డిసెంబర్ 26: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలీస్ ఉద్యోగం కోసం నిర్వహించిన ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్షకు 80 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉన్నతాధికారులు ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని హెచ్సీ ఉత్తమ్ తెలిపారు.
తాంసిలో..
తాంసి, డిసెంబర్ 26: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచితంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన యువతీ, యువకులకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఎస్ఐ ధనశ్రీ, కానిస్టేబుళ్లు ప్రవీణ్, చిరంజీవి పాల్గొన్నారు.