ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర
జిల్లాలో 19 కేంద్రాలు ఏర్పాటు
4361 మంది అభ్యర్థులు హాజరు
ఎదులాపురం,డిసెంబర్26: పోలీస్ ఉద్యోగ ఎంపిక శిక్షణకు నిర్వహించిన రాత పరీక్షకు భారీ స్పందన వచ్చిందని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం రాజేశ్ చంద్ర తెలిపారు. మూడు నెలల ఉచిత శిక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన రాత పరీక్షలకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో యువతీయువకులు హాజరయ్యారు. రాత పరీక్షలో ఎంపికైన వారికి మూడు నెలల పాటు జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో 19 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి ఎస్ఐల పర్యవేక్షణలో పకడ్బందీగా రాత పరీక్ష నిర్వహించామని చెప్పారు. ఈ పరీక్షకు అత్యధికంగా ఉట్నూర్ డివిజన్ నుంచి 3వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల పరీక్ష నిర్వహించగా 4361 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. ఈ నెల 28న ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు జనవరి 3 స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రంలో మూడు నెలల పాటు ఉచిత శిక్షణను ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్కు చెందిన పోటీ పరీక్షల నిపుణలతో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బోధన ఉంటుందని వివరించారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచితంగా భోజనం ,అల్పాహారం, టీ అందిస్తామన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని పోలీస్ ఉద్యోగాలు సాధించాలన్నారు. అదనపు ఎస్పీ సమయ్ జాన్రావు ఆధ్వర్యంలో ప్రణాళిక ప్రకారం శిక్షణ ఉంటుందన్నారు.