కాపలా లేకున్నా పంటలకు రక్షణ
తప్పిన అటవీ జంతుల బెడద
బోథ్, డిసెంబర్ 26: అటవీ జంతువుల బారి నుంచి పంటలు రక్షించుకునేందుకు రైతులు ఇబ్బందులు పడే వారు. నిద్రాహారాలు మాని రాత్రిపూట పొలాల వద్ద కాపలా కాసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. కాని ఇప్పుడా పరిస్థితి దూరమైంది. సోలార్ కంచెతో పంటల రక్షణకు ఢోకా లేకుండా పోయింది. అటు అటవీ జంతువులకు ఎలాంటి హాని లేకపోవడంతో వీటి వినియోగం పెరుగుతున్నది. వానకాలంలో సాగు చేస్తున్న పత్తి, కంది పంటలతో పాటు యాసంగిలో మక్క, జొన్న, శనగ పంటలకు అటవీ జంతువుల బెడద కొంతకాలంగా ఎక్కువైంది. అడవి పందులు, కోతులు, జింకలు, మనుబోతులు ఈ పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. ప్రధానంగా కోతులు, అడవి పందులతో తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. వీటి నుంచి పంటలను రక్షించుకునేందుకు వీలుగా సోలార్ కంచెలను వివిధ కంపెనీలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. రెండెకరాలు మొదలుకొని 20 ఎకరాల వరకు వినియోగించుకునేలా వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. రూ. 7500 నుంచి రూ. 12,500 వరకు ఆయా కంపెనీలను బట్టి దొరుకుతున్నాయి. నాలుగెకరాల వరకున్న పంట చుట్టూ కంచె కోసం 20 వోల్ట్స్ సోలార్ ప్యానెల్, 12 ఆంప్స్ (ఏహెచ్) బ్యాటరీ, ఎనర్జర్, కర్రలకు బిగించే 100 టర్నర్లు, బ్యాటరీ క్లిప్పులు రూ. 7,500లకు దొరుకుతున్నాయి. నాలుగెకరాల నుంచి 20 ఎకరాల వరకు వినియోగించేందుకు వీలుగా 40 వోల్ట్స్ సోలార్ ప్యానెల్, 32 ఆంప్స్ బ్యాటరీ, ఎనర్జర్, 150 టర్నర్లు, బ్యాటరీ క్లిప్పులు రూ. 12,500లకు లభ్యమవుతున్నాయి. వీటిని కొనుగోలు చేసిన రైతులు పొలాల చుట్టూ కంచె ఏర్పాటు చేసుకొని పంటలను రక్షించుకుంటున్నారు. పొలం చుట్టూ ఇనుప తీగ కర్రలకు టర్నర్ల సహాయంతో ఫెన్సింగ్లా కట్టుకొని సోలార్కు అనుసంధానం చేస్తున్నారు. సోలార్ ఫెన్సింగ్తో అటు అటవీ జంతువులకు ఎటువంటి ప్రాణ నష్టం లేక పోవడంతో వీటి కొనుగోలుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఏటా తాము పడుతున్న పంటల రక్షణ తిప్పలు సోలార్ ఫెన్సింగ్తో తీరాయని అంటున్నారు.
కాపలా అవసరం లేదు..
ఇప్పుడు కంది, శనగ పంటల కాపలాకు వెళ్లాల్సిన అవసరం లేదు. నాలుగెకరాల పంట చేను చుట్టూ సోలార్ కంచె బిగించా. ఇది వరకు నిత్యం రాత్రి పూట పొలం వద్దనే కాపలా ఉండేటోళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. రెండు, మూడు రోజులకోసారి పొలానికి వెళ్లి పంటను చూసి వస్తున్న.
-బడాల సతీశ్రెడ్డి, రైతు, కౌఠ(బీ)