రూ.80 లక్షలతో అభివృద్ధి పనులు
ప్రత్యేక ఆకర్షణగా ప్రకృతి వనం
అభివృద్ధి బాటలో కొత్త పంచాయతీ
ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు
నార్నూర్, నవంబర్ 26;పల్లెల్లో అభివృద్ధి పనులకు నోచుకోక గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారు. అనుబంధ గ్రామాల మాట చెప్పనవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చిన్న గ్రామాలతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన సీఎం కేసీఆర్ కొత్త గ్రామ పంచాయతీలకు శ్రీకారం చుట్టారు. జనాభా ప్రతిపాదికన ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి అన్ని భావించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి పల్లెప్రగతి పేరిట ప్రత్యేక నిధులు కేటాయించింది. దీంతో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. పల్లెప్రగతి కార్యక్రమాలతో రూపురేఖలు మారి పల్లెలు పట్టణ హంగులతో కనబడుతున్నాయి.
గాదిగూడ మండలంలో కొత్తగా ఏర్పడిన సావిరీ గ్రామం పల్లెప్రగతితో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. 2011 ప్రకారం గ్రామంలో మొత్తం 155 కుటుంబాలకు గాను 645 మంది జనాభా ఉండగా 480 మంది ఓటర్లు ఉన్నారు. కొత్త గ్రామపంచాయతీ కావడంతో అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. సర్పంచ్గా ఎన్నికైన కొడప మోతుబాయి పార్టీలకతీతంగా గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో రూ.లక్షతో 200 మీటర్ల డ్రైనేజీ నిర్మాణం చేపట్టింది. రూ.లక్షతో పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేసి 4 వేల మొక్కలు పెంచుతున్నారు. రూ.2.50 లక్షలతో డంప్యార్డు, రూ.1.50 లక్షలతో నర్సరీ, రూ.2 లక్షలతో సెగిగ్రేషన్ షెడ్డు నిర్మించారు. రూ.12.50 లక్షలతో వైకుంఠధామం నిర్మిస్తున్నారు. 120 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. రూ.8లక్షలతో ట్రాక్టర్ కొనుగోలు చేసి పంచాయతీ పనులకు వాడుతున్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా 1200 మొక్కలు పెంచుతున్నారు. ప్రతి నెలా పంచాయతీకి రూ.92వేలు నిధులు వస్తున్నాయి. ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తూ పంచాయతీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుండడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధజలం సరఫరా చేస్తున్నారు.
అధికారుల ప్రోత్సాహంతోనే..
పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రభుత్వ నిధులతో పాటు స్థానిక అధికారుల ప్రోత్సాహం ఉంది. జిల్లా అధికారులు, ఎంపీడీవో రామేశ్వర్, ఎంపీవో సాయిప్రసాద్, గ్రామపెద్దల సలహాలు,సూచనల మేరకు పనులు వేగవంతం చేశాం. కొత్త పంచాయతీ అయినప్పటికీ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నది. గ్రామసభలో గ్రామస్తుల సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం.
-సునీల్కుమార్, పంచాయతీ కార్యదర్శి, సావిరీ