2003లో సందర్శించి హామీ ఇచ్చిన నేత కేసీఆర్
మహారాష్ట్ర సర్కారుతో చర్చలు
ఆ వెంటనే నిధులు మంజూరు
ఇరు రాష్రాల ఒప్పందంతో చకచకా సాగిన పనులు
ఆదిలాబాద్ జిల్లాలో 52 వేల ఎకరాలకు సాగు నీరందే అవకాశం
ఆనందంలో రైతులు
ఆదిలాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘చుట్టూ గోదారి.. మన భూములు ఎడారి..’ సమైక్య పాలనలో తెలంగాణలో సాగు నీటిపై కొనసాగిన వివక్షకు ‘అక్షరాలా..’ ఓ కవి ఆవేదన ఇది… కానీ స్వరాష్ట్రంలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి, ఆయకట్టుకు మళ్లించే లక్ష్యంతో సర్కారు సాగునీటి యజ్ఞాన్ని కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా చనాక-కొరాట ప్రాజెక్టును నిర్మిస్తుండగా, ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నది. 2003లో అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ శ్రేణులతో కలిసి ఆందోళనల కోసం ఢిల్లీకి బయలుదేరి వెళ్తూ జైనథ్ మండలం డొల్లార సమీపంలోని పెన్గంగను సందర్శించారు. తెలంగాణ ఏర్పడితే ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తామన్న హామీ మేరకు, 2015లో సీఎం హోదాలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి లోయర్ పెన్గంగ ప్రాజెక్టుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కొరాట వద్ద నిర్మించే బరాజ్, పంప్హౌస్ పనులకు రూ.384 కోట్లు, ప్రాజెక్టు, కాలువలకు రూ.1,227 కోట్లు కేటాయించారు. మొత్తానికి టీఆర్ఎస్ సర్కారు చొరవతో 46 ఏండ్ల కల సాకారం కాబోతుండగా, ఆదిలాబాద్ జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జీవనది గోదావరికి ఉపనదిగా ఉన్న పెన్గంగపై ప్రాజెక్టు నిర్మించాలని 1975 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. నాలుగు బరాజ్లను నిర్మిస్తే 88 శాతం మహారాష్ట్ర, 12 శాతం నీటిని తెలంగాణ వాడుకోవాల్సి ఉంటుంది. పెన్గంగపై మహారాష్ట్రలోని మూడు ప్రాజెక్టులు, మన రాష్ట్రంలోని చనాక-కొరాట వద్ద మరో బరాజ్ను నిర్మిస్తున్నారు. మహారాష్ట్రలో నిర్మించే ప్రాజెక్టుల కాలువల ద్వారా నీటిని జిల్లాకు తీసుకొస్తారు. అక్కడి నుంచి వచ్చే నీటి ద్వారా జిల్లాలో 47,520 ఎకరాలకు సాగునీరు అందుతుంది. దాదాపు 46 ఏండ్లుగా పెన్గంగ నీటిని నిల్వచేసి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరినా, ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2003లో అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ ఆధ్వర్యం లో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనకు హైదరాబాద్ నుంచి బ యలు దేరారు. జైనథ్ మండలం డొల్లార సమీపంలో పెన్గంగ వద్ద ఆగారు. జిల్లా నాయకుడు లోక భూమారెడ్డి భోజనాలు ఏర్పాటు చేశా రు. ఆ సమయంలో పెన్గంగను సందర్శించిన కేసీఆర్ చనాక-కొరాట ప్రాజెక్టు నిర్మాణానికి హామీ ఇ చ్చారు. 2015లో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆ ర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు తో కలిసి మహారాష్ట్ర సీఎం, మంత్రులు, అధికారులతో చర్చలు జరిపారు. ఫలితంగా ప్రా జెక్టు నిర్మాణానికి రెండు రాష్ర్టా లు ఆమోదం తెలిపాయి. మన రాష్ట్రంలోని జైనథ్ మండలం కొరాట వద్ద నిర్మించే బరాజ్, పంప్హౌస్ నిర్మాణ పనులకు రూ.384 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పెన్గంగ ప్రాజెక్టుకు రాష్ట్రంలో నిర్మించే కాలువలకు మహారాష్ట్రకు రూ.1,227 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. చనాక-కొరాట ప్రాజెక్టు నిర్మాణంతో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లోని ఐదు మండలాల రైతులకు చెందిన 52 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
బరాజ్ నిర్మాణం పూర్తి..
కొరాట వద్ద 0.98 టీఎంసీల పెన్గంగ నీటిని నిల్వ చేసేందుకు బరాజ్ను నిర్మిస్తుండగా.. పనులు పూర్తయ్యాయి. 23 పిల్లర్లు నిర్మించడంతో పాటు గేట్లు బిగించారు. రెండు అబట్మెంట్స్ నిర్మాణాలు పూర్తికాగా.. మహారాష్ట్ర వైపు గోడ నిర్మాణం కొనసాగుతున్నది. 47 కిలోమీటర్ల ప్రధాన కాలువ నిర్మించాల్సి ఉండగా.. పనులు పూర్తయ్యాయి. వీటితో పాటు 129 బ్రిడ్జిలు నిర్మించారు. ప్రెసర్ మెయిన్స్కు సంబంధించి నాలుగు కిలోమీటర్లకుగానూ 3 కిలోమీటర్ల పైపులు వేశారు. వేగంగా రిజర్వాయర్లోని నీటిని కాలువల్లోకి ఎత్తిపోసేందుకు పంప్హౌస్ను నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కాంక్రీట్ పనులు అయిపోయాయి. పంప్హౌస్ మోటర్లు నడిచేందుకు విద్యుత్ సబ్స్టేషన్ను సైతం నిర్మించారు. మెటార్లు బిగించడం, డెలివరీ పైప్స్ పనులు కొనసాగుతుండగా, వీటిని వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులు నిరంతరం పనులను పర్యవేక్షిస్తూ అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. డిసెంబర్ చివరి నాటికి ట్రయల్న్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పుంజుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల రైతులు ఎక్కువగా వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేస్తారు. ప్రాజెక్టు నిర్మాణంతో రైతులు రెండు పంటలను సాగుచేసుకొనే అవకాశం లభిస్తుంది. దీంతో పాటు పలు గ్రామాల్లో భూగర్భ జలాల మట్టం పెరిగి తాగునీటికి సైతం ఇబ్బందులు ఉండవు. మత్స్యకారులు సైతం చేపలు పెంచుకొని ఉపాధి మెరుగుపర్చుకొనే అవకాశం లభిస్తుంది.
46 ఏండ్ల నుంచి కానిది ఇప్పుడు అవుతుంది..
పెన్గంగపై ప్రాజెక్టు నిర్మిస్తే ఆదిలాబాద్, బోథ్ నియోజవర్గాల్లోని 52 వేల ఎకరాలకు నీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇక్కడి రైతులు 46 ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులను ప్రాజెక్టు నిర్మించి సాగునీరు అందేలా చూడాలని కోరారు. పట్టించకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యంకా ని ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చేస్తున్నారని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ హామీ మేరకే పనులు..
తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ హామీ మేరకే చనాక-కొరాట బ్యారేజీ పనులతో పాటు కాలువల నిర్మాణ పనులు సాగుతున్నయ్. ఉమ్మడి రాష్ట్రంలో జరగని పనులు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నయ్. 40 ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న మాకు కాలువల ద్వారా రెండు పంటలకు సాగు నీరు అందనుంది.
-ఎర్రం హన్మంతు, రైతు, కొరాట
చిరకాల కోరిక నెరవేరింది..
పెన్గంగానది ప్రాజెక్టు నిర్మాణంతో ఈప్రాంత రైతుల చిరకాల స్వప్నం నెరవేరింది. చనాక-కొరాట వద్ద నిర్మించిన ప్రాజెక్టు కాలువల ద్వారా రెండు పంటలకు సాగునీరు అందనుంది. దీని ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. 40 ఏండ్ల మా చిరకాల కోరిక నెరవేరింది. తెలంగాణ సర్కారు కృషితోనే సాధ్యం.
-గోస్కుల రూపేశ్, రైతు, కొరాట