తెల్లబంగారానికి రికార్డు స్థాయిలో ధర
మద్దతు ధరకంటే రూ.1945 ఎక్కువ
కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
ఆదిలాబాద్, అక్టోబరు 25 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో వానకాలం సీజన్లో 3.90 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని సాగుచేశారు. దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో 27 లక్షల క్వింటాళ్ల పత్తి విక్రయానికి వస్తుందని అంచనా వేసిన అధికారులు రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా సూచించిన విధంగా సోమవారం జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఆదివారం రాత్రి నుంచే రైతులు పత్తి వాహనాలు, ఎడ్ల బండ్లలో మార్కెట్యార్డుకు తీసుకొచ్చారు. ఉదయం మార్కెటింగ్ సిబ్బంది వేలం నిర్వహించగా వ్యాపారులు క్వింటాలుకు రూ.7920 చెల్లిస్తామని ప్రకటించారు. తేమ విషయంలో సడలింపు ఇవ్వాలని రైతులు కోరగా, అదనపు కలెక్టర్ నటరాజ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి వ్యాపారులతో చర్చించగా, మరో రూ.50 పెంచుతామని వ్యాపారులు తెలిపారు. 8 వరకు తేమశాతంతో క్వింటాలుకు రూ.7970తో ధర నిర్ణయం కాగా, కలెక్టర్ సిక్తా పట్నాయక్ కాంటా వద్ద పూజలు చేసి కొనుగోళ్లను ప్రారంభించారు.
రికార్డు ధర
ప్రభుత్వం క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.6025 ప్రకటించగా, ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధర కంటే రూ.1945 ఎక్కువ చెల్లించి రూ.7970 చొప్పున కొనుగోలు చేశారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులను అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ చెప్పారు. జిన్నింగ్ల్లో సైతం అధికారులు కొనుగోళ్లను పర్యవేక్షిస్తూ రైతులకు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.7970 ధర రావడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు 10 వేల క్వింటాళ్ల వరకు కొనుగోళ్లు చేసినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.