నిర్మల్ టౌన్, అక్టోబర్ 25: జిల్లాలో నవంబర్ ఒకటి నాటికి వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కొవిడ్ వ్యాక్సినేషన్పై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో అర్హులైన వారందరూ రెండు డోసులు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్య ఆరోగ్యశాఖ సర్వే నిర్వహించి వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 81 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. జిల్లాలో పోడు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, పంచాయతీ ఈఈ శంకరయ్య, జిల్లా పశువైద్యాధికారి రమేశ్కుమార్, జిల్లా వైద్యాధికారులు ధన్రాజ్, అవినాశ్ పాల్గొన్నారు.
మొక్కలకు జియోట్యాగింగ్ పూర్తి చేయాలి
హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో హరితహారం నిర్వహణపై జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 2021-22 సంవత్సరానికిగాను నిర్దేశించిన లక్ష్యం మేరకు అన్ని శాఖలు హరితహారంలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు జియోట్యాగింగ్ విధానాన్ని వందశాతం పూర్తి చేయాలని కోరారు. ఇక్కడ అదనపు కలెక్టర్లు, డీపీవో వెంకటేశ్వర్రావు, జడ్పీ సీఈవో, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సృజనాత్మకతను వెలికి తీసేందుకే పోటీలు
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 25 : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ పోటీలు నిర్వహిస్తున్నటు నిర్మల్ కలెక్టర్ ముఫారఫ్ అలీ ఫారూఖీ, డీఈవో రవీందర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఇన్నోవేషన్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రతి సంవత్సరం ఇన్నోవేషన్ చాలెంజ్ కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 13 నుంచి 19 వరకు టీచర్లు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి వినోద్కుమార్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, నారాయణవర్మ, రఫీక్, అన్సారీ తదితరులున్నారు.