నేడు ఏసు పుట్టిన రోజు
ముస్తాబైన చర్చీలు
విద్యుత్ దీపాలతో కళకళలాడుతున్న ప్రార్థనా మందిరాలు
ఏసు క్రీస్తు జన్మించిన శుభదినాన్నే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్గా జరుపుకుంటారు. మెర్రీ క్రిస్మస్ అంటే ఆనందం అని అర్థం. సమస్త మానవాళిని పాప విముక్తులను చేసి దైవసన్నిధి చేర్చేందుకు ఏసు ప్రభువు మానవ రూపంలో జన్మించాడని చెబుతారు. నజరేతు గ్రామంలో నివసించే సామాన్య కన్య మరియ. ఆమె గొప్ప దైవ భక్తురాలు. ఆమెకు వడ్రంగి యువకుడైన యోసేపుతో వివాహం నిశ్చయమవుతుంది. దైవ సంకల్పంతో మరియ గర్భం దాల్చింది. యోసేపు తన స్వగ్రామమైన బెత్లేహాంకు నిండు చూలాలైన మరియను తీసుకెళ్తాడు. పశువుల పాకలో మరియ కుమారుడికి జన్మనిచ్చి పశువుల తొట్టెలో పడుకోబెడుతుంది. పొలాల్లో పశువులను కాసేకాపరులకు దేవదూతలు కనిపించి, ‘మీకు రక్షకుడు పుట్టాడు’ అని తెలిపి అదృశ్యమవుతారు. ఆ కాపరులు పశువుల పాకకు వెళ్లి బాల ఏసును చూసి దేవుని మహిమను లోకానికి తెలియజేశారు. ఇలా మానవాళి పాపాలను ప్రక్షాళన చేసేందుకు ఏసు జన్మించాడంటారు. అందుకే క్రైస్తవులు క్రిస్మస్ను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
స్వరాష్ట్రంలో ఘనంగా వేడుక..
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తున్నది. బతుక మ్మ పండుగ కోసం ఆడబిడ్డలకు చీరెలు, రంజాన్ సందర్భంగా ముస్లింలకు కొత్త బట్టలు అందజేస్తున్నది. క్రిస్మస్కు క్రిస్టియన్ మైనార్టీల్లోని పేదలకు 2014 నుంచి గిఫ్ట్ ప్యాక్లు ఇస్తున్నది. ఏటా విందు భోజనాలకు నిధులు కేటాయిస్తున్నది
చర్చీలు ముస్తాబు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చీలు వేడుకలకు ముస్తాబయ్యాయి. రంగులు వేసి.. విద్యుద్దీపాలను అమర్చి శోభాయమానంగా ముస్తాబు చేశారు. బాల యేసు, మేరి మాత, క్రిస్మస్ ట్రీలు, పశువుల పాకలు, నక్షత్రాలు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు, క్రీస్తు ఆరాధనలు ప్రారంభమవుతాయి. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టారు.