బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
కప్పర్లలో రూ.94 లక్షలతో రామాలయం నిర్మాణానికి భూమిపూజ
తాంసి, డిసెంబర్ 24 : ఓట్లకోసమే బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని, తాతలు, తండ్రుల నుంచి ప్రతి గ్రామంలో రామాలయాలున్నాయని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. తాంసి మండలం కప్పర్లలో రూ.94 లక్షలతో రామాలయం నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేశారు. బండలనాగాపూర్లో 14 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాముడు కేవలం బీజేపీ వారికే సొంతం అయినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికలప్పుడు ‘జై శ్రీరాం’ నినాదాన్ని ఎత్తుకొని ఓట్లు దడుకుంటున్నారని మండిపడ్డారు. ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి ఎన్నికై ఇన్ని సంవత్సారాలు గడుస్తున్నా ఒక్క అభివృద్ధి పనీ చేయలేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయం కోసమే హిందూ నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ ఎంతో కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణలోనే అమలు అవుతున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని దళితులకు త్వరలో దళితబంధు పథకం అమలు చేస్తామని స్పష్టంచేశారు. వచ్చే బడ్జెట్లో ప్రతి నియోజకవర్గానికి 100 మంది దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అనంతరం మండలంలోని కప్పర్లలో రూ.94 లక్షలతో నిర్మించే రామాలయం, కాలక్షేప మండపానికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, నాయకులు కార్యకర్తలతో కలిసి భూమిపూజ చేశారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హోమాధి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీపీ సురుకుంటి మంజులా శ్రీధర్రెడ్డి, జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీడీవో ఆకుల భూమయ్య, తహసీల్దార్ సంధ్యారాణి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్కుమార్, సర్పంచ్లు గంగుల వెంకన్న, సదానందం, కేశవ్రెడ్డి, గజానన్, శ్రీనివాస్, ఎంపీటీసీలు అశోక్, కౌడాల భాగ్యవతి, రఘు, టీఆర్ఎస్ మాజీ కన్వనీర్ పులి నారాయణ, వీడీసీ చైర్మన్ వెంకట్రెడ్డి, సురేశ్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, మాజీ సర్పంచులు నారాయణ, భగవాండ్లు, నాయకులు మహేందర్, సతీశ్, రాజేశ్వర్, శంకర్, దాసు, ఉత్తం, చంద్రన్న పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి
గుడిహత్నూర్, డిసెంబర్ 24 : ప్రతి ఒక్కరూ అధ్యాత్మికతను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. గుడిహత్నూర్ మండలంలోని కమలపూర్ గ్రామంలో సప్తాహం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దైవ చింతన ద్వారానే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ బౌరే ప్రేమలత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్, ఏఎంసీ వైస్ చైర్మన్ జంగు, నాయకులు పాల్గొన్నారు.