ఎదులాపురం, డిసెంబర్24: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి క్యాడర్ ఉద్యోగులకు ఈ నెలాఖారు నాటికి పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జిల్లా స్థాయి క్యాడర్ కేటాయింపుల ప్రక్రియ ముగిసిందని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రాధాన్యత అంశాలను పరిగణలోకి తీసుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు శాఖల వారీగా ఉద్యోగుల కేటాయింపు జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించబడిన ఉద్యోగుల సీనియారిటీ ,పోస్టింగ్లకు సంబంధించిన వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో ఈ నెల 25న ఆయా కార్యాలయాల్లో ప్రదర్శించాలన్నారు. ఇతర జిల్లాల నుంచి ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించిన ఉద్యోగుల నుంచి ప్రాధాన్యతలను నిర్ణీత ప్రొఫార్మాలో ఈ నెల 26,27 తేదీల్లో స్వీకరించాలన్నారు. అనంతరం ఈ నెల 28,29 తేదీల్లో ఉద్యోగులకు పోస్టింగ్ ఉత్తర్వులు ఇస్తామన్నారు. ఈ నెలాఖరులోగా ఉద్యోగులకు అందించిన పోస్టింగ్ ఆర్డర్ల ప్రకారం విధుల్లో చేరాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్ ఎస్ నటరాజ్, ఆర్డీవో రాజేశ్వర్, కలెక్టరేట్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.