నిర్మల్ టౌన్, డిసెంబర్ 24 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ముగియగా, వారంతా 30వ తేదీలోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 9,356 మంది ఉపాధ్యాయులు ఆప్షన్లు పెట్టుకోగా.. సీనియారిటీ ఆధారంగా వెయ్యి మంది బదిలీ అయినట్లు విద్యాశాఖాధికారులు వెల్లడించారు. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు సీనియారిటీ ఆధారంగా బదిలీల ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు వారి మొబైల్ ఫోన్లకు బదిలీ సమాచారం అందింది. కాగా, ఈ నెల 30వ తేదీలోగా విధుల్లో చేరాల్సిందిగా విద్యాశాఖ సూచించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 2600కు పైగా ఉపాధ్యాయులకు స్థానచలనం లభించినట్లు విద్యాశాఖాధికారులు పేర్కొంటున్నారు. ఇందులో అత్యధికంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయినట్లు తెలుస్తున్నది. ఆయా జిల్లాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులు సీనియారిటీ ఆధారంగా మొదటి ప్రాధాన్యత కింద ఎంపిక చేసుకున్న పాఠశాలకు పోస్టింగ్ కేటాయించి, తర్వాత మెరిట్లో ఉన్న వారికి అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ కార్యాలయంతో పాటు ఎంఈవో కార్యాలయాల్లో రిపోర్టు అందించడంతో ఖాళీలను బట్టి కౌన్సెలింగ్ ద్వారా సీనియారిటీ ప్రతిపాదికన కేటాయింపు నిర్వహించనున్నట్లు విద్యాశాఖాధికారులు పేర్కొన్నారు.
అత్యధికంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ నుంచి నిర్మల్కు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి అత్యధిక మంది ఉపాధ్యాయులు నిర్మల్ జిల్లాకు బదిలీ అయ్యారు. జూనియర్లలో నిర్మల్తో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి ఎక్కువ మంది ఉపాధ్యాయులు కుమ్రం భీం ఆసిఫాబాద్కు బదిలీ అయినట్లు తెలుస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9,356 ఉపాధ్యాయ పోస్టులుండగా.. 2,600 మందిని బదిలీ చేశారు. ఇందులో ఎక్కువ మందిని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు కేటాయించారు. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఏళ్ల తరబడి పనిచేస్తూ బదిలీ కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం సీనియారిటీ ప్రతిపాదికన బదిలీ అవకాశం ఇవ్వడంతో వారంతా ఆదిలాబాద్, నిర్మల్కు ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారందరికీ అవకాశం దక్కింది.