శాఖల సమన్వయంతో చేరిన లక్ష్యం
13,614 మందికి కరోనా వ్యాక్సినేషన్
రెండోడోస్ టార్గెట్పై వైద్య యంత్రాంగం దృష్టి
నార్నూర్, డిసెంబర్ 24 : కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ రెండుడోస్ల టీకా తప్పనిసరిగా తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఆ మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియపై దృష్టి సారించాయి. స్పెషల్డ్రైవ్ చేపట్టి అర్హులందరికీ టీకా వేయాలని నిర్ణయించాయి. వైద్య సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి.. ప్రజ ల్లో అవగాహన కల్పిస్తున్నాయి. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకున్నది. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లిన గాదిగూడ మండలం మొదటిడోస్ను వందశాతం పూర్తి చేసి.. రెండోడోస్ లక్ష్యంపై దృష్టి సారించింది. మండలం మొత్తం జనాభా 20,087 మంది ఉండగా.. 13,614 మంది వ్యాక్సినేషన్కు అర్హులుగా గుర్తించారు. వైరస్ కట్టడిలో భాగంగా ఈ ఏడాది ప్రారంభం నుంచే వ్యాక్సినేషన్ చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ, ఇతర శాఖలు సమన్వయంతో ముందుకెళ్లి.. అర్హులందరికీ మొదటి డోస్ పంపిణీని పూర్తి చేశారు. మొదటి డోస్ 100 శాతం పూర్తికావడంతో రెండో డోస్ను కూడా వేగవంతం చేశారు. ఇప్పటివరకు సెకండ్డోస్ సుమారు నాలుగు వేల మందికి వేసినట్లు వైద్యులు తెలిపారు.
ప్రణాళికతో ఫలప్రదం..
మండలంలో వైద్య ఆరోగ్య సిబ్బంది సర్వే నిర్వహించి ప్రజలకు టీకాపై అవగాహన కల్పించారు. ఇంటింటా తిరుగుతూ వ్యాక్సిన్ వేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యాక్సినేషన్ ప్రాధాన్యంపై ప్రేరణ కల్పించారు. పదిరోజులుగా ప్రయాణ ప్రాంగణాలు, సమీకృత మార్కెట్లతో పాటు రద్దీ ప్రాంతాల్లోనూ టీకా వేశారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్యారోగ్య సిబ్బంది ఇం టింటికీ తిరిగి వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి వేశారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు, మహిళా రైతులు పనులకు వెళ్తే అక్కడికీ వెళ్లి డోసు వేశారు. బృందాలుగా వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి లక్ష్యాన్ని అధిగమించారు. మొదటి డోస్ వేసుకున్న 13,614 మందికి సెకండ్ డోస్ వేసేందుకు అధికారులు ముందుకు కదులుతున్నారు. ఇప్పటి వరకు 4 వేల మందికి టీకా వేసినట్లు అధికారులు చెబుతున్నారు. గాదిగూడ మండలంలోని రెండు పీహెచ్సీల పరిధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నెలాఖరులోపు రెండో డోస్ టీకా లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేసేలా కృషి చేస్తున్నారు. కాగా.. కలెక్టర్ సిక్తా పట్నాయక్, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, వైద్య ఆరోగ్య బృందం సహకారంతో మొదటి డోసు టీకాను 100 శాతం పూర్తి చేశామని గాదిగూడ మెడికల్ ఆఫీసర్ సీ పవన్కుమార్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో సెకండ్ డోస్ కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.