పథకం అమలుకు పటిష్ట ప్రణాళిక
సర్కారు ఆశయాన్ని నెరవేర్చి తీరుతాం
సీఎం ఆదేశాల మేరకు మంత్రి, ఎమ్మెల్యేలతో సమీక్షించాం
ఫిబ్రవరి మొదటి వారంలోగా లబ్ధిదారుల ఎంపిక
మార్చి నెలాఖరుకల్లా యూనిట్ల పంపిణీ
నమస్తే’తో నిర్మల్ కలెక్టర్ ముషారఫ్అలీఫారూఖీ
నిర్మల్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. జిల్లాలో దీనిని పకడ్బందీగా అమలు చేసి, సర్కారు ఆశయాన్ని నెరవేరుస్తాం. స్థానిక ప్రజల నిర్ణయం మేరకే లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ఫిబ్రవరి మొదటి వారంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి, మార్చి చివరికల్లా యూనిట్లు అందజేస్తాం’ అని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు విషయాలు వెల్లడించారు.
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు మానసపుత్రికగా పేరొందిన దళితబంధు పథకం అమలుపై ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తాం. గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక విధానం కూడా గ్రామస్తుల నిర్ణయం మేరకే జరుగుతంది. ఈ పథకం అమలుకు సంబంధించి వచ్చే ఫిబ్రవరి మొదటి వారంలోగా లబ్ధిదారులను ఎంపిక చేసి మార్చి నెలాఖరుకల్లా వారికి యూనిట్లను అందజేస్తాం. ఇప్పటికే ఈ పథకంపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖనాయక్లతో చర్చించాం’ అని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. పూర్తి వివరాలు..
నమస్తే : జిల్లాలో దళితబంధు అమలు ఎంత వరకు వచ్చింది..?
కలెక్టర్: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంబంధితశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దళితబంధు అమలుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని మూడు నియోజక వర్గాల పరిధిలో ఎమ్మెల్యేలతో చర్చించి గ్రామాలను ఎంపిక చేస్తాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ పథకం అమలైన హుజురాబాద్, తదితర ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపిక జరిగిన తీరును పరిశీలిస్తున్నాం.
ప్రశ్న: పథకం అమలుకు క్షేత్రస్థాయి ప్లానింగ్ ఎలా ఉండబోతోంది…?
ప్రతి నియోజకవర్గంలోని మండలాల్లో ఏదైన ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తే ఆ గ్రామంలోని అర్హులైన అన్ని దళిత కుటుంబాలకు పథకాన్ని అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలోగా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి మార్చి చివరి నాటికి యూనిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించాం. గ్రౌండింగ్ పూర్తయిన తరువాత లబ్ధిదారులపై అదనపు కలెక్టర్ స్థాయిలో నియోజక వర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించి పర్యవేక్షిస్తాం.
నమస్తే : అర్హుల ఎంపికకు తీసుకుంటున్న ప్రామాణికాలు ఏంటి..?
కలెక్టర్ : ముందుగా గ్రామాన్ని ఎంపిక చేసి గ్రా మస్తులతో సమావేశాన్ని నిర్వహిస్తాం. ఆయా గ్రామాల్లో అత్యంత పేదరికంలో ఉండి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం పొందని వారిని గుర్తించి అర్హులను ఎంపిక చేస్తాం. ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారులందరికీ పథకాన్ని వర్తింపజేస్తాం.
నమస్తే : లబ్ధిదారుల ఎంపిక ఎప్పటి వరకు పూర్తి కానుంది..?
కలెక్టర్ : వచ్చే నెల మొదటి వారంలోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని అనుకుంటున్నాం. ఇప్పటికే ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత కుటుంబాల వివరాలను సేకరిస్తున్నాం.
నమస్తే : దళిత బంధు పథకంలో లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీలో ప్రభుత్వ ఆదేశాలే పాటిస్తారా..? లేదా జిల్లాలో స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందిస్తారా..?
కలెక్టర్ : దళితబందు పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తూనే అవసరమైతే ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. స్థానికంగా ఎలాంటి నైపుణ్యాలు ఉంటే అలాంటి యూనిట్లను అందజేసి అంతిమంగా నిరంత ఆదాయం వచ్చేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యంగా దళితబందు పథకం కోసం ఇక్కడి యువత ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అలాంటి వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది.
నమస్తే : జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో ఈ పథకం అమలుకు ఎన్ని నిధులు అవసరం కావోచ్చు…?
కలెక్టర్ : నిర్మల్ జిల్లా పరిధిలో మూడు నియోజక వర్గాలు ఉన్నప్పటికీ ఖానాపూర్ నియోజకవర్గంలో సగభాగం పక్క జిల్లా పరిధిలోకి వస్తుంది. దీంతో రెండున్నర నియోజక వర్గాలకు సంబంధించి దళితబందు అమలు కోసం రూ. 25 కోట్లు ఖర్చవుతాయి.
నమస్తే : ఈ పథకంలో ఎమ్మెల్యేల పాత్ర ఏంటి..? వారి భాగస్వామ్యం ఎలా ఉండబోతోంది..?
కలెక్టర్ : దళిత బందు పథకం అమలులో శాసన సభ్యుల పాత్ర వారి నియోజక వర్గ పరిధిలోని గ్రామాల గుర్తింపు వరకే ఉంటుంది. ఆయా గ్రామాల ఎంపిక విధానాన్ని పూర్తి పారదర్శకంగా, చట్ట ప్రకారం నిర్వహిస్తాం.
నమస్తే : ఈ పథకం అమలుకు కో ఆర్డినేషన్ మీటింగ్ ప్లానింగ్ ఉందా..? ఉంటే ఎప్పుడు ఉండవచ్చు..?
కలెక్టర్ : వచ్చే 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తయిన తరువాత మరోసారి ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నాం. ఆ సమావేశంలోనే లబ్ధిదారుల గుర్తింపును ఫైనల్ చేస్తాం.