ఆదిలాబాద్ రూరల్, జనవరి 24 : జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ ఆవరణలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని గ్రంథాలయ ఆవరణలో రూ.3 కోట్లతో నిర్మించనున్న భవనానికి సోమవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయ భవనాలు శిథిలావస్థకు చేరడంతో నూతన భవనం కోసం గతంలోనే రూ.3.70కోట్ల నిధులు మంజూరు చేయించామని పేర్కొన్నారు. భవనానికి సంబంధించిన డిజైన్లు ఆలస్యం కావడంతో గతంలోనే రూ.70 లక్షలతో పనులు ప్రారంభించామన్నారు. మరో రూ.3 కోట్ల పనులు ప్రారంభించామని, వీటితో మూడంతస్తులు సుమారు 10వేల చదరపు మీటర్ల వరకు నిర్మాణమవుతున్నదని పేర్కొన్నారు. గ్రంథాలయం చుట్టూ షాపింగ్కాంప్లెక్స్ కూడా నిర్మించడంతో అదనపు ఆదా యం చేకూరి పాఠకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించవచ్చన్నారు. గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా అన్ని రకాల వసతులతో భవనం నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం కాస్త ఇబ్బందులున్నా వాటిని తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాలయంలోని పుస్తకాలను ఉపయోగించుకుని తమ బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలన్నారు. అవసరమైతే మరిన్ని నూతన పుస్తకాలు తేవడానికి సహకరిస్తామని తెలిపారు. మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజానీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌతు మనోహర్, కౌన్సిలర్లు బండారి సతీశ్, ప్రకాశ్, నాయకులు పాల్గొన్నారు.
కూరగాయల మార్కెట్లో వసతులు కల్పిస్తాం..
జిల్లా కేంద్రంలోని సీసీఐ ప్రాంతంలో ఉన్న కూరగాయల మార్కెట్లో త్వరలోనే వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. కూరగాయల మార్కెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వ్యాపారులు ఆయనను ఘనంగా సన్మానించారు. మార్కెట్లో అత్యవసరమైన విద్యుత్, నీటి వ్యవస్థను త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాత జాతీయ రహదారి నుంచి మార్కెట్వరకు రోడ్డు నిర్మాణంపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. కౌన్సిలర్ సాయి ప్రణయ్, షేక్ కరీం, కస్తాల ప్రేమల పాల్గొన్నారు.
‘సాత్నాల’కు ప్రతిపాదనలు పంపాలి
ఆదిలాబాద్ టౌన్, జనవరి 24 : జిల్లాలోనే ఏకైక మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన సాత్నాల ఎడమకాలువ పునరుద్ధరణ పనుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపాలని ఎమ్మెల్యే జోగురామన్న అధికారులను ఆదేశించారు. మండలంలోని సాత్నాల ప్రాజెక్టు ఎడమకాలువను పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు, రైతులతో కలిసి కొంత వరకు మోటర్సైకిల్పై, తర్వాత కొన్ని కిలోమీటర్ల మేర కాలినడకన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. రాంపూర్, యాపల్గూడ శివార్ల నడుమ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికీ ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. రామా యి శివారంలో లిఫ్ట్ ఇరిగేషన్ కోసం సర్వేలు చేపట్టి తొందరగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అనంతరం కుంభేఝరి గ్రామానికి వెళ్లి ప్రతి ఇంటికీ తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. మైనర్ ఇరిగేషన్ ఈఈ విఠల్ రాథోడ్, డీఈ శ్రీనివాస్, ఏఈ మారుతి, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.