ఇంద్రవెల్లి, జనవరి 24 : కెస్లాపూర్ నాగోబా జాతరలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నాగోబా జాతరను విజయవంతం చేద్దామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండలంలోని కెస్లాపూర్ నాగోబా దర్బార్హాల్లో ఐటీడీఏ పరిధిలోని అధికారులతో పాటు ఆయా శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో జాతర ఏర్పాట్లపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గత సంవత్సరంలో చేసిన ఏర్పాట్లతోపాటు అభివృద్ధి కార్యక్రమాలపై శాఖల వారీగా అధికారులతో చర్చించారు. ముందుగా నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో చేయాల్సిన ఏర్పాట్లతోపాటు భక్తులకు కల్పించే సౌకర్యాలు, కొవిడ్ నిబంధనలపై అధికారులతో చర్చించారు. జాతరలో ఏర్పాటు చేసే తైబజార్లోని వివిధ రకాల దుకాణాల వ్యాపారస్తులతోపాటు హోటళ్లలో కరోనా నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. జాతరలోనూ జ్వర సర్వేలు చేసి, అవసరమైన వారికి కొ విడ్ పరీక్షలు చేయాలన్నారు. మెస్రం వంశీయులకు నీటితో పాటు మరుగుదొడ్లు, స్నానపు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేసి శుభ్రత పాటించాలన్నారు. వాహనాల కోసం పార్కింగ్, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. దర్శనానికి వీఐపీలతోపాటు ప్రముఖులు వచ్చే రోజు అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని సూచించారు. 24 గం టలు విద్యుత్ సరఫరా చేయాలని, ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. అధికారులు శాఖల వారీగా జాతర ఏర్పాట్లను 30 లోపు పూర్తి చేయాలన్నారు. ఐటీడీఏ పీవో అంకిత్, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, ఐటీడీఏ ఏపీవో జనరల్ భీంరావ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడిమెత మనోహర్, ఐటీడీఏ ఏవో రాంబాబు, విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్జాడే, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, ఐటీడీఏ ఈఈ భీంరావ్, డీఈ శివకుమార్, డీపీవో శ్రీనివాస్, సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్, మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, ఈవో రాజమౌళి, తహసీల్దార్ రాఘవేంద్రరావ్, ఎంపీడీవో పుష్పలత, ఎఫ్ఆర్వో పాండునాయక్, ఎస్ఐ నందిగామ నాగ్నాథ్, మెస్రం వంశీయులు నాగ్నాథ్, దేవ్రావ్, సోనేరావ్, శేఖర్బాబు, ఆనంద్రావ్, తుకారామ్, మెస్రం షేకు పాల్గొన్నారు.