నార్నూర్, జనవరి 24 : కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలని మండల ప్రత్యేకాధికారి శ్రీనాథ్ పేర్కొన్నారు. మండలంలోని గంగాపూర్, కొత్తపల్లి(హెచ్), భీంపూర్, భవానిగూడ, మారపగూడ, చోర్గావ్, శేకుగూడ, మహగావ్, ఉమ్రి గ్రామాల్లో ఐకేపీ, వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ నిర్వహిస్తున్న జ్వర సర్వేను మండల ప్రత్యేకాధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్న వారికి హోంఐసోలేషన్ కిట్లు అందించాలన్నారు. అర్హులందరూ టీకా వేసుకోవాలని సూచించారు. అంతకుముందు పలు గ్రామాల్లో నర్సరీ నిర్వహణ, మొక్కల సంరక్షణ, పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. ఆయన వెంట ఎంపీడీవో రమేశ్, ఈజీఎస్ ఏపీవో జాదవ్ శేషారావ్, వైద్య , అంగన్వాడీ, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.
భీంపూర్ మండలంలో..
భీంపూర్, జనవరి 24 : మండలంలోని కరంజి(టీ), అందర్బంద్, భీంపూర్, అర్లి(టీ) ఉపకేంద్రాల పరిధిలో వైద్యసిబ్బంది జ్వర సర్వే నిర్వహించారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేశారు. పాజిటివ్ వచ్చిన వారికి మందుల కిట్లు పంపిణీ చేశారు. కొందరికి రెండో డోసు ఇచ్చారు. కార్యక్రమంలో సూపర్వైజర్ గంగాధర్, సిబ్బంది విష్ణు, సుజాత, సరస్వతి, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
బోథ్ మండలంలో..
బోథ్, జనవరి 24: మండలంలోని సొనాల, కౌఠ(బీ), బోథ్, ధన్నూర్(బీ), పొచ్చెర గ్రామాల్లో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ తిరుగుతూ జ్వర సర్వే నిర్వహించారు. ప్రజల ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వారికి కిట్లు పంపిణీ చేసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆశకార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, వీవోఏలు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి
నార్నూర్, జనవరి 24 : కొవిడ్ నిబంధనలు పాటించాలని గాదిగూడ ఎంపీవో సాయిప్రసాద్ అన్నారు. గాదిగూడ మండలం పర్సువాడ(కే) గ్రామంలో నిర్వహించిన ఇంటింటా సర్వేను పరిశీలించారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్న వారికి మందుల కిట్ అందజేశారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, సిబ్బంది ఉన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
నేరడిగొండ, జనవరి 24 : కరోనా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్ఈవో హరికుమార్గౌడ్ సూచించారు. మండలంలోని బుగ్గారం, గుత్పాల, నేరడిగొండ, తర్నం, తేజాపూర్, వడూర్, వాంకిడి గ్రామాల్లో 4309 మందిని పరీక్షించి 139 మందికి కిట్లు అందజేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్ రాంనరేశ్, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.