ఆదిలాబాద్, అక్టోబర్ 23 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పోడు భూముల సమస్య పరిష్కారంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, నాలుగు జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ, ఐటీడీఏ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పోడు భూములు, అటవీ రక్షణ, హరితహారం తదితర అంశాలపై చర్చించారు. అడవులను ధ్వంసం చేసేవారిపై పీడీయాక్టు నమోదు చేయాలని, నవంబర్ 8లోగా వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం గ్రామ కమిటీల నియామకం చేపట్టాలని సూచించారు. రెండు, మూడు గ్రామాలకో నోడల్ అధికారిని నియమించాలని, సబ్ డివిజన్ స్థాయిలో ఆర్టీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. కాగా, 1.85 లక్షల ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు ఇటీవల అటవీశాఖ అధికారులు గుర్తించగా, త్వరలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులకు పట్టాలు పంపిణీ చేసే అవకాశమున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పోడు భూముల సమస్య పరిష్కారానికి సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్ ప్రగతిభవన్లో పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీరక్షణ, హరితహారం అంశాలపై కలెక్టర్లు, అటవీ, గిరిజన, పంచాయతీరాజ్, పోలీసు శాథల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సూచనలు చేశారు. అమాయక గిరిజనులు అడవులను కంటికి రెప్పలా కాపాడుతారని, బయట నుంచి వచ్చే శక్తులు అడవిని నాశనం చేస్తాయన్నారు. అడవులను ధ్వంసం చేసేవారిపై పీడీయాక్టు కేసులు నమోదు చేయాలని సూచించారు. అడవుల లోపల పోడు సాగు చేస్తున్న గిరిజనులకు సమీపంలోని ప్రభుత్వ భూములను సాగు చేసుకునేందుకు ఇవ్వాలని, లేనిపక్షంలో అటవీభూముల అంచున సాగుభూమిని కేటాయించి నీరు, కరంటు నివాస సదుపాయాలు కల్పించాలన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణపై కలెక్టర్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు. నవంబరు 8 నుంచి డిసెంబర్ 8 వరకు పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనుల నుంచి క్లెయిమ్స్ స్వీకరించాలని, నవంబర్ 8లోగా వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం గ్రామ కమిటీల నియామకం చేపట్టాలన్నారు. రెండు,మూడు గ్రామాలకో నోడల్ అధికారిని నియమించాలని, సబ్ డివిజన్ స్థాయిలో ఆర్టీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో గంజాయి సాగు చేస్తే పట్టాలు రద్దు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మారుమూల ఆదివాసీ గూడేలు, గిరిజన తండాల్లో స్థానికులు అటవీ భూముల్లో వ్యవసాయం చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోని ఖాళీ భూములు, అడవులు నరికివేతకు గురైన భూముల్లో సైతం భూమిలేని వారు ఎన్నో ఏళ్లుగా పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2006లో పోడు వ్యవసాయం చేస్తున్న కొందరు రైతులకు ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలను అందజేసింది. ఉమ్మడి జిల్లాలో 1,36,117 ఎకరాల్లో పంటలు పండిస్తున్న 37,324 మంది రైతులకు ప్రస్తుతం హక్కు పత్రాలను అందజేసింది. ఈ భూములకు ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఉచిత పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది. దీంతో వారు మంచి పండించుకుంటూ ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో పోడు వ్యవసాయం కొనసాగుతూనే ఉంది. కొందరు తమ జీవనోపాధి కోసం తక్కువ విస్తీర్ణంలోని అటవీ భూముల్లో పంటలు పండిస్తుండగా, మరికొందరు ఎక్కువ భూమిని ఆక్రమించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోడు వ్యవసాయం కారణంగా పలు సమస్యలు వస్తున్నాయి. అధికారులు హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి అక్కడికి వెళ్లడం.. రైతులు అడ్డుకోవడంలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టారు. అర్హులైన వారందరికీ పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ఇటీవల తెలిపారు. పట్టాల పంపిణీలో భాగంగా రైతులు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు దరఖాస్తులు చేసుకున్నారు. పూర్తిస్థాయిలో పరిశీలన జరిపిన అధికారులు అర్హులైన వారికి పట్టాలు జారీ చేసే అవకాశాలున్నాయి. ఎన్నో ఏళ్లుగా తాము సాగుచేస్తున్న భూములకు పట్టాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టాలు పంపిణీ చేస్తే తమకు సర్కారు సాయం అందడంతో పాటు ఇతర ప్రయోజనాలు చేకూరే అవకాశముందని గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో పర్యటించిన ఉన్నతాధికారులు
పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన బృందం గురువారం ఉట్నూర్లో పర్యటించింది. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి, సీసీసీఎఫ్ శోభ, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ, సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అదనపు సీసీసీఎఫ్ మోహన్ చంద్ర పర్గెన్తో కూడిన బృందం నాలుగు జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులతో సమావే శం నిర్వహించా రు. పోడు భూములు, అటవీ సంరక్షణ, హరితహారంపై జిల్లాల వా రీగా సమీక్షించారు. అటవీ భూముల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, స్వాధీనం చేసుకున్న భూముల బాధితులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన అటవీశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.85 లక్షల ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో 56,140 ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 19,543 ఎకరాలు, కుమ్రం భీం ఆసిఫాబా ద్ జిల్లాలో 1,00,533 ఎకరాలు, మంచి ర్యాల జిల్లాలో 8789 ఎకరాలు భూములు కబ్జాకు గురైనట్లు నిర్ధారించారు. పోడు భూముల సమస్యపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితోపాటు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, రాహుల్రాజ్, ముషారఫ్ అలీ ఫారూఖీ, భారతీ హోళికేరి, అటవీశాఖ అధికారులు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పాల్గొన్నారు.