సారంగాపూర్/ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 23 :కరోనా కారణంగా వాయిదా పడిన ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి.ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 141 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 31,429 మంది హాజరుకానున్నారు. కొవిడ్ నిబంధనల నడుమ పరీక్షలు నిర్వహించనుండగా, విద్యార్థులు మాస్క్, శానిటైజర్, వాటర్ బాటిల్ తెచ్చుకోవాలని, నిమిషం ఆలస్యమైనా సెంటర్లలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఈసారి సులువుగా మూల్యాంకనం చేసేందుకు ప్రత్యేకంగా యాప్ను రూపొందించారు.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రభు త్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయగా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల అధికారగణం ఏర్పాట్లలో నిమగ్నమైంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరం విద్యార్థులను పై తరగతులకు ప్రమో ట్ చేసిన ప్రభుత్వం.. సెకండియర్ విద్యార్థులకు మా ర్కులు పెంచుతూ మెమోలు జారీ చేసింది. అయితే ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 25 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
అధికారుల నియామకం..
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇందులో కస్టోడియన్ అధికారులు 14 మంది, ఏఎస్లు 145 మంది, డీవోలు 145 మంది, ఏసీఎస్లు 46 మంది, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు 7, సిట్టింగ్ స్కాడ్ బృందాలు 11తో పాటు హైపర్ కమిటీ ఉంటుంది. ఉమ్మడి జిల్లాల ఇంటర్మీడియట్ అధికారుల నేతృత్వంలో డెక్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయి.
మొబైల్ యాప్తో సేవలు..
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణలో నూతనంగా మొబైల్ యాప్ సేవలు వినియోగించనున్నారు. ఓఎంఆర్ షీట్లో మాల్ప్రాక్టీస్, బ్లాంక్ బార్ కోడ్, ఆబ్సెంట్, డ్యామేజ్డ్, బార్కోడ్, ఎయిడెడ్ క్యాండె ట్స్ వంటి సేవలను యాప్ ద్వారా నిర్వహించనున్నారు.
ఫ్లయింగ్, సిట్టింగ్ స్కాడ్లకు శిక్షణ…
ఇంటర్మీడియట్ అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్లయింగ్, సిట్టింగ్ స్కాడ్లకు ఇటీవల శిక్షణ ఇచ్చారు. వీరికి పలు సూచనలు, సలహాలు కూడా అందించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
కొవిడ్ నిబంధనల మధ్య..
కొవిడ్ నిబంధనలను పరీక్షా కేంద్రాల్లో తప్పని సరిగా అమలు చేయాలని అధికారులు సీఎస్, డీవోలను ఆదేశించారు. ప్రతి విద్యార్థి మాస్కుధరించడంతో పాటు వాటర్బాటిల్, శానిటైజర్ను కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. మాస్కులేని విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్షా కేంద్రాల్లో థర్మల్స్క్రీనింగ్, శానిటైజర్ను తప్పని సరిచేశారు. ప్రతిరోజూ పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్ను శుభ్రం చేయనున్నారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల వసతులు కల్పిస్తున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఆదిలాబాద్ డీఐఈవో కార్యాలయంలో కంట్రోల్రూం నంబర్ 08732-2297115, 9848781808ను అందుబాటులో ఉంచారు. విద్యార్థులకు కొవిడ్ నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నందున ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. జనరల్ విభాగంలో 8,891మంది, ఒకేషనల్ విభాగంలో 1039మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 47 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఇప్పటికే 47మంది సీఎస్, డీవోలను నియమించారు. వారికి పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. పరీక్ష సామగ్రిని ఇప్పటికే ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించారు. పరీక్షల్లో ఎలాంటి కాపీయింగ్కు ఆస్కారం లేకుండా రెండు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను, ప్రశ్నాపత్రాలను భద్రపరిచేందుకు 13 స్టోరేజ్ పాయింట్లను ఏర్పాటు చేశారు.
31,429 మంది విద్యార్థులు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 31,429 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో నిర్మల్ జిల్లా నుంచి 7,924 మంది, ఆదిలాబాద్ జిల్లా నుంచి 9,930 మంది, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి 5,208 మంది, మంచిర్యాల జిల్లా నుంచి 8,367 మంది చొప్పున ఒకేషనల్, జనరల్, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఆన్సర్ షీట్లు ఇప్పటికే డీఐఈవో కార్యాలయాలకు చేరుకున్నాయి. ప్రశ్నపత్రాలు కూడా ఒకటి, రెండు రోజుల్లో ఆయా పోలీస్ స్టేషన్లకు చేరుకోనున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 141 పరీక్షా కేంద్రాలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణకు 141 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో నిర్మల్ జిల్లాలో 33, ఆదిలాబాద్ జిల్లాలో 47, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 24, మంచిర్యాల జిల్లాలో 37 చొప్పున సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లోనే విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.