70 ఏళ్లలో కనిపించని అభివృద్ధి ఏడేళ్లలో చేసినం
దమ్ముంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు చర్చకు రావాలి
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 23: దేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో బలమైనదిగా టీఆర్ఎస్కు గుర్తింపు దక్కిందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని టీఎన్జీవో గార్డెన్లో శనివారం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పట్టణ విస్తృత స్థాయీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి అత్యధిక మంది కార్యకర్తలు సభ్యులుగా ఉన్నారన్నారు. ఆదిలాబాద్ టౌన్లో 6వేల మందితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో కమిటీలు వేశామని చెప్పారు. మరో 600 మందికి జిల్లా కమిటీలో స్థానం దక్కుతుందన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా టీఆర్ఎస్దే విజయమని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీల 70 ఏళ్ల పాలనలో చేయని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లలో చేసిందని ప్రజలే చెప్పుకుంటున్నారన్నారు. ఈ నెల 27న ఆదిలాబాద్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన అభివృద్ధి పనులపై చర్చించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో జరుగుతున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. అనంతరం పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు, యువజన విభాగాల కమిటీలు వేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అజయ్, అశ్రఫ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, యూనిస్ అక్బానీ, రోకండ్ల రమేశ్ పాల్గొన్నారు.
బ్రిడ్జి పనుల పరిశీలన
ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నంబర్ 41 సాయినగర్లో రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే జోగు రామన్న శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతలో రాజీ పడవద్దని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అనంతరం కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను పరిశీలించి ఇంటింటికీ తిరిగి టీకాలు వేయాలని సిబ్బందికి సూచించారు.
బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్యే
బేల, అక్టోబర్ 23 : మండంలోని కొగ్దూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్యే జోగురామన్న విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం కొగ్దూర్లో ఎస్డీఎఫ్ నిధులు రూ. 25 లక్షలతో చేపడుతున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులు పరిశీలించారు. టీఆర్ఎస్ నాయకుడు యూనిస్ అక్బానీ, అడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్పవార్, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, నాయకులు ప్రమోద్రెడ్డి, సతీశ్పవార్, చౌహాన్ సుధాకర్, మంగేశ్ ఠాక్రే, దేవన్న, తన్వీర్ఖాన్, ఎంపీడీవో భగత్వ్రీందర్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ
కొగ్దూర్లో ఇటీవల అనారోగ్యంతో ఖడ్సే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడంతో శనివారం ఎమ్మెల్యే జోగురామన్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.