యాసంగిలో శనగ, ధనియా ఇతర పంటల సాగుపై ఆసక్తి
బాగుందంటున్న అన్నదాతలు
నేరడిగొండ, జనవరి 23 : రైతులు యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయాధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలతో వారిలో మంచి ఫలితాలు వచ్చినట్లు కనిపిస్తున్నది. మండలంలోని వడూర్, వాంకిడి, నేరడిగొండ, కుమారి, బుద్దికొండ, తర్నం, వాగ్దారి, వెంకటాపూర్ గ్రామాల్లో రైతులు యాసంగిలో శనగ, ధనియా, సోయ, జొన్న, మక్క, గోధుమ, నువ్వు పంటలు సాగు చేస్తున్నారు. వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆరుతడి పంటల్లో పెట్టుబడితో పాటు ఇతర ఖర్చులు తక్కువగా ఉండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. మండలంలో 9వేల ఎకరాలకు పైగా ఆరుతడి పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
ఖర్చులు తక్కువే…
పంట వేసినప్పటి నుంచి పూర్తయ్యే వరకు మందుల ఖర్చులు తప్ప ఇతర తక్కువేనని రైతులు చెబుతున్నారు. ఆరుతడి పంటల్లో మందులు, కలుపు, కోతలో ఖర్చులు ఉంటాయి. దిగుబడులు ఎక్కువగా రావడంతో లాభం పొందవచ్చని అంటున్నారు. అలాగే పంట మార్పిడి చేయడం ద్వారా కూడా రైతులకు లాభం చేకూరుతుందని వ్యవయాధికారులు సూచిస్తున్నారు