ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 4 డిగ్రీలలోపు టెంపరేచర్
రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ.. అప్రమత్తంగా ఉండాలని సూచన
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ);ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ అత్యల్పంగా నమోదవుతున్నాయి. ఈ యేడాది ఇప్పటివరకు కనిష్ఠంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో 3.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో 3.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. సింగిల్ డిజిట్కు పడిపోవ డంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. కాగా.. ఇక్కడి గ్రామాల్లో చలి తీవ్రత తగ్గకపోవడంతో ఉదయం 11 గంటలకు కూడా ప్రజలు చలిమంటలు కాగుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మూడు రోజులుగా ఆరు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటున్నాయి. ప్రతి యేటా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యాణి మండలం గిన్నెధరి గ్రామంలో కనిష్ఠంగా ఉన్నాయి. దాదాపు 4 నుంచి 5 డిగ్రీలు ఇక్కడ సాధారణమే. ఇంకా సిర్పూర్ యు, వాంకిడి మండలాలు, ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని అర్లీ(టి) గ్రామాల్లో కూడా నమోదవుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28.6 డిగ్రీలు ఉంటున్నాయి. సింగిల్ డిజిట్ కంటే తక్కువగా నమోదు కావడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్గా ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యల్ప టెంపరేచర్ నమోదైన ప్రాంతాల పరిధిలో అధికంగా వర్షాలు కురవడం, ఎత్తయిన ప్రాంతాల్లో గ్రామాలు ఉండడం, వాగులు, వంకలు ప్రవహిస్తుండడం, అడవుల మధ్యలో పల్లెలు ఉండడం వల్ల చలి తీవ్రత అధికంగా ఉంటున్నది. కాగా.. ఉదయం ఎనిమిది గంటలైనా మంచుతెరలు తొలగడం లేదు. సాయంత్రం ఐదు గంటలకే చికటి అవుతున్నది. చలి భరించలేక ప్రజలు పగలే చలి మంటలు కాగుతున్నారు.