నిర్మల్ టౌన్, అక్టోబర్ 22 : ‘ప్రయాణికుల సేవే.. ప్రథమ కర్తవ్యం..’ నినాదంతో టీఎస్ ఆర్టీసీ ముందుకు సాగుతున్నది. రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్ ధరలు ఇబ్బందిగా మారినా, ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నది. ప్రైవేట్ వాహనాల కంటే తక్కువ చార్జీలు తీసుకోవడమే కాకుండా, పలు రాయితీలు ప్రకటిస్తున్నది. కరోనా కారణంగా ఆక్యుపెన్సీ రేషియో తగ్గినా దానిని పెంచుకునేందుకు వినూత్నంగా ముందుకు సాగుతున్నది. క్రమంగా లాభాల బాట పడుతుండగా, ప్రజలు ఆదరిస్తే ఆదాయం మరింత మెరుగుపడనున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, భైంసా, ఆదిలాబాద్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోలున్నాయి. ఇందులో 2700 మంది కార్మికులు పని చేస్తున్నారు. 2459 మంది కార్మికులు కాగా.. 351 మంది ఉద్యోగులు ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 619 బస్సులుండగా, అందులో 372 ఆర్టీసీ బస్సులు, 247 ప్రైవేట్ బస్సులున్నాయి. ఈ బస్సులు ప్రతిరోజూ 2,59,024 కిలోమీటర్లు తిరుగుతుండగా, సుమారు రూ.90 లక్షల ఆదాయం రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం రూ.68.70 లక్షలే వస్తున్నట్లు తెలుస్తున్నది. పండుగ సమయంలో మాత్రమే అదనంగా రూ.10 లక్షల ఆదాయం వస్తుండగా.. రోజుకు రూ.21.30 లక్షల నష్టం వాటిల్లడంతో ఆర్టీసీ నష్టాల ఊబిలో చిక్కుకపోతున్నది.
రాయితీలు అమలు..
ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. పదోతరగతి వరకు బాలికలకు ఉచిత బస్సు పాసులు, 20 రోజుల చార్జితో 30 రోజుల ప్ర యాణం, దివ్యాంగులకు, పాత్రికేయులకు రా యితీ ప్రయాణం, విద్యార్థులకు తక్కువ చార్జితోనే బస్సు పాసులు, ఆన్లైన్ రిజర్వేషన్, కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిం ది. బస్సుల్లో ప్రయాణిస్తూ చనిపోతే రూ. 2.50 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల వరకు నష్టపరిహారం కూడా అందిస్తున్నది. కాగా, సంస్థ బాగు కోసం ఇంధనం పొదుపు చేయాలని కార్మికులకు అవగాహన కల్పిస్తున్నది. మంచి కేఎంపీఎల్ కిలోమీటర్కు 5.70 వినియోగించిన డ్రైవర్లకు జిల్లా, రీజియన్, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులను అందజేస్తున్నది. ఆయా మార్గాల్లో ఆర్టీసీ నిర్దేశించిన దానికంటే ఎక్కువ ఆదాయం సంపాదించిన కార్మికులకు బోనస్ కూడా ప్రకటిస్తున్నది. 40 మంది ప్రయాణికులుంటే వారి వద్దకే బస్సు సౌకర్యం ఏర్పా టు చేస్తున్నది. విహారయాత్రలకు, పెండ్లిళ్లకు బస్సులను కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఆర్టీసీపై భరోసా పెంచేలా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన ఎండీ సజ్జనార్ వినూత్న కార్యక్రమాలు చేపడుతూ సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు.
పెరుగుతున్న డీజిల్ ధరలతో తప్పని ఇబ్బంది..
రోజురోజుకూ పెరిగిపోతున్న డీజిల్ ధరలు ఆర్టీసీకి తలకుమించిన నష్టాన్ని కలిగిస్తున్నాయి. 2016లో డీజిల్ ధర రూ.68.73 ఉండగా.. ఇప్పుడు రూ.107కి చేరుకుంది. అంటే ఆరేండ్లలో రూ.40 పెరిగింది. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ కోసం టీఎస్ఆర్టీసీ కార్మికులు చారిత్రాత్మకంగా 52 రోజుల పాటు సమ్మెలో పాల్గొని కీలకపాత్ర పోషించారు. తెలంగాణ వస్తే ఆర్టీసీ కార్మికులకు అవసరమైన ఫిట్మెంట్ను అందిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. 2015లో 44శాతం ఫిట్మెంట్ను అందించి కార్మికులకు భరోసా కల్పించారు. దీంతో ఆర్టీసీ సంరక్షణకు ప్రభుత్వం డీజిల్పై భారాన్ని కూడా ఐదు శాతం తగ్గించారు. కానీ పెరిగిన డీజిల్ ధరలకుతోడు నిర్వహణ ఖర్చులు భారమైనప్పటికీ ఆర్టీసీ ఆదాయం మాత్రం పెరగడం లేదు. దీనికితోడు 2020, మార్చి నుంచి కరోనా విజృభించడంతో ఆర్టీసీకి మరిన్ని కష్టాలు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం బస్సులను తాత్కాలికంగా రద్దు చేసింది. దీంతో రోజుకు సగటున రావాల్సిన ఆదాయం కోల్పోయింది. కరోనా తగ్గిన తర్వాత బస్సులు నడిపేందుకు అనుమతివ్వగా.. ఇప్పుడిప్పుడే ప్ర యాణికుల సంఖ్య పెరుగుతున్నది. ఆర్టీసీ ఆక్యుపెన్సీ 70 శాతం ఉం డగా.. ప్రస్తుతం 50-58 శాతం మంది మాత్రమే బస్సుల్లో ప్రయా ణం చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రయాణ చార్జీలు తక్కువే..
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు రూ.110కి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు 60 కిలోమీటర్లు పోవాలంటే రూ.110 ఖర్చు చేయాల్సి ఉంది. ఆర్టీసీ బస్సులో కేవలం రూ.60కే చేరుకోవచ్చు. కుటుంబసభ్యులందరూ బస్సుల్లో హాయిగా వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రజలు అనాలోచిత విధానంతో అత్యవసరం లేకున్నా బైక్లు, ప్రైవేట్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఆయా రూట్లో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నా ప్రయాణికులు ఎక్కకపోవడంతో నష్టాలను చవిచూస్తున్నది. ప్రస్తుతం ఆర్టీసీలో కనీస చార్జి(పల్లెవెలుగు) రూ.10 ఉంది. అదే ప్రైవేట్ వాహనాల్లో రూ.20-రూ.50 వసూలు చేస్తున్నారు. ఏ గ్రామానికి బస్సు కావాలన్నా భరోసా ఇస్తే చాలు.. అక్కడికి బస్సు పంపే సౌకర్యం కల్పిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆర్టీసీ తమదిగా భావించి ఆదరిస్తే కష్టాల నుంచి గట్టెక్కే అవకాశాలున్నాయి. దీనివల్ల మెరుగైన రవాణాతో పాటు గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవచ్చు.
ప్రైవేట్ వారికీ ఉపాధి..
టీఎస్ ఆర్టీసీలో పని చేస్తున్న రెగ్యులర్ కార్మికులకుతోడు ప్రైవేట్(హైర్) బస్సుల్లో పని చేస్తున్న కార్మికులు 700 మందికి కూడా ఉపాధి లభిస్తున్నది. ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లతో పాటు క్లీనర్ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 247 ప్రైవేట్ బస్సులుండగా, వీటిపై ఆర్టీసీ డ్రైవర్లుగా నిరుద్యోగ యువకులు విధులు నిర్వహిస్తున్నారు. రూ. 10,500 వేతనంతో పని చేస్తూ నెలలో 15 రోజుల పాటే విధులు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఒకవేళ ఆర్టీసీ ప్రైవేట్ పరమైతే ప్రైవేట్ బస్సులపై విధులు నిర్వహించే వారు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది.
8 ఏండ్లుగా ఉపాధి..
మాది నిర్మల్ పట్టణంలోని బోయవాడ. ఆర్టీసీ లో ప్రైవేట్ బస్సుపై ఎనిమిదేండ్లుగా విధులు ని ర్వహిస్తున్నా. నెలలో 15 రో జుల పాటు డ్యూటీ ఉంటుం ది. నెలకు 10,500 వేతనం వ స్తున్నది. ఓటీ కింద మరో ఐ దు రోజుల పాటు పనిచేస్తే మరో రూ.5వేలు సంపాదించుకుంటున్నా. మిగతా సమయంలో ఆటో నడుపుతూ కు టుంబ అవసరాలు తీర్చుకుంటున్నా. టీఎస్ఆర్టీసీలో ఎప్పటికైనా పర్మినెంట్ ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో వేతనం తక్కువైనా పని చేస్తున్నా.
-సర్దార్సింగ్, ప్రైవేట్ డ్రైవర్