ప్రకటించిన కౌన్సిలర్ ఆఫ్ ఎన్విరో ఎక్సలెన్స్ సంస్థ
దక్షిణ భారతస్థాయిలో ఈ ఏడాది నాలుగోది..
సీఎండీ శ్రీధర్ హర్షం
శ్రీరాంపూర్/జైపూర్, అక్టోబర్ 22 : సింగరేణి కాలరీస్ కంపెనీ మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది మరో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సంబంధించి వివిధ అంశాలపై అధ్యయనం చేస్తూ ప్రోత్సాహక అవార్డులను ప్రకటించే కౌన్సిల్ ఆఫ్ ఎన్విరో ఎక్సలెన్స్(ముంబై) సంస్థ వారు 2021వ సంవత్సరానికి ఎనర్జీ ఎఫీషియన్సీ అవార్డును శుక్రవారం జాతీయ స్థాయిలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రకటించారు. దక్షిణ భారతదేశంలో 500 మెగావా ట్లు, ఆపై స్థాయి ఉత్పత్తి సామర్థ్యమున్న సుమారు 100 ప్లాం ట్ల విభాగంలో ఈ అత్యుత్తమ అవార్డు జైపూర్ ఎస్టీపీపీకి వరించినట్లు నిర్వాహకులు తెలిపారు. సాధారణంగా 600 మెగావాట్ల సామర్థ్యమున్న ప్లాంట్లు ఒక యూనిట్ను ఉత్పత్తి చేయడానికి 2444 కిలో కాలరీ శక్తిని (బొగ్గును) వినియోగించవచ్చని ప్రామాణికంగా సూచిస్తుంటారు. కాగా 1200మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉన్న రెండు ప్లాంట్లలో ఒకటో ప్లాంట్ ఒక యూనిట్ విద్యుత్కి ఉత్పత్తి నిర్దేశిత ప్రమాణాల కన్నా తక్కువగా సగటున 2425 కిలో కాలరీ శక్తి(బొగ్గు)ని మాత్రమే వినియోగిస్తున్నది. ఇలా అత్యంత సమర్థవంతంగా బొగ్గును వినియోగిస్తున్నందు కు గుర్తింపుగా ఎనర్జీ ఎఫీషియన్సీ అవార్డును ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తక్కువ బొగ్గుతో తగిన ఉష్ణోగ్రతను సాధించడం, ప్లాంట్ అవసరాలకు విద్యుత్, ఆయిల్ వినియోగంలోనూ పొదుపు పాటించడంతో ఈ అవార్డుకు ఎంపికైంది.
ఈ ఏడాది వరుసగా నాలుగు అవార్డులు..
ఎస్టీపీపీ ఈ ఏడాది వరుసగా నాలుగు అవార్డులు లభించాయి. సంస్థ ప్రారంభమై కేవలం ఐదేండ్లు మాత్రమే అయినప్పటికీ తన పనితీరుతో, అవలంబిస్తున్న ఆత్యుత్తమ నిర్వాహణ పద్ధతులతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 100 థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఆదర్శప్రాయంగా ఉంటున్నది. గత ఏడాది ప్రభుత్వ థర్మల్ విద్యుత్ కేంద్రాల విభాగంలో అత్యుత్తమ పీఎల్ఎఫ్ సాధించిన ప్లాంట్లలో దేశంలోనే 2వ స్థానం సాధించి తన ప్రతిభ చాటుకుంది. కాగా.. ముంబైకి చెందిన ప్రముఖ మిషన్ ఎనర్జీ సంస్థ ఈ ఏడాది దక్షిణ భారత స్థాయిలో మూడు అవార్డులను సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి అందజేశారు. ఇందులో వాటర్ ఎఫిషియన్సీ ప్లాంట్ అవార్డు, బెస్ట్ పవర్ ప్లాంట్ పర్ఫార్మర్ అవార్డు, బెస్ట్ ఫ్లైయాష్ యుటిలైజేషన్ అవార్డులున్నాయి. తాజాగా సమర్థవంతంగా ఇంధనాన్ని (బొగ్గును) వినియోగిస్తున్నందుకు ఎనర్జీ ఎఫీషియన్సీ అవార్డుకు ఎంపికైందని, త్వరలో ఈ అవార్డు స్వీకరించనున్నారు. సమీక్షలు నిర్వహిస్తూ.. లోపాలను సవరిస్తూ తగిన సౌకర్యాలను కల్పిస్తున్న నేపథ్యంలోనే తాము థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నామని అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే తాము అవార్డులు పొందుతున్నామని పేర్కొన్నారు.
సీఅండ్ఎండీ శ్రీధర్ అభినందనలు..
అవార్డు రావడంపై సీఎండీ శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ప్లాంట్ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇప్పటికే ఈ ప్లాంట్ మంచి పీఎల్ఎఫ్ సాధిస్తూ దేశంలోనే అత్యుత్తమ ప్లాంట్లలో ఒకటిగా నిలిచిందని, ఇదే పని తీరును కనబరుస్తూ మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.