ఉమ్మడి జిల్లాలో ఉద్యమంలా సాగిన హరితహారం
ఏడు విడుతల్లో 15 కోట్లకుపైగా మొక్కల పెంపకం
పలుచోట్ల మొక్కలు నాటిన ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న అటవీశాఖ మంత్రి అల్లోల
నిర్మల్ టౌన్, జనవరి 22 :పలుచబడ్డ అడవి చిక్కగా మారింది. మోడువారిన చెట్లు మహావృక్షంలా ఎదిగాయి. అడవుల పునరుజ్జీవానికి హరితసాధకుడు కేసీఆర్ సంకల్పం సిద్ధించింది. ఆకుపచ్చని అద్భుతం ఆవిష్కృతమైంది. వన్యప్రాణులు, దేశవిదేశీ పక్షులకు ఆవాసంగా నిలిచింది. వరుణుడి కుంభవృష్టికి కారణమైంది..! ఇదంతా కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఏడేండ్ల క్రితం ప్రారంభించిన హరితహారంతోనే సాధ్యమైంది. ఉమ్మడి జిల్లాలో ఏడు విడుతలుగా 15 కోట్లకుపైగా మొక్కలు నాటాగా.. 33.23 శాతం ఉన్న అడవులు 35.66 శాతానికి పెరిగాయి. అంటే అదనంగా 2.66 శాతం వృద్ధి చెందాయి. ఇటీవల ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఐ) నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అడవుల జిల్లాగా పేరుంది. ఉమ్మడి జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణం 16,105 చదరపు కిలోమీటర్లు కాగా.. ఇందులో 5,743.40 చదరపు కిలోమీటర్లు(35.66 శాతం) అడవులు విస్తరించి ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం 23 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచాలన్న సంకల్పంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర లక్ష్యాన్ని మించి 35.66 శాతం అంటే 2.66 శాతం అడవులు అధికంగా విస్తరించాయి. ఫలితంగా జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. ఇండియా స్టేట్ ఫారెస్టు(ఐఎస్ఎఫ్) రెండేళ్లకోసారి దేశంలోని అన్ని జిల్లాల్లో అటవీ విస్తీర్ణం పెరుగుదలను అధికారికంగా ప్రకటిస్తున్నది. 2015లో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం 2017లో మొదటిసారిగా చేసిన సర్వేలో 5,536.18 హెక్టార్లు(33.32 శాతం), 2019లో 5,721.32(35.53 శాతం), తాజా సర్వేలో 5,743.42(35.66 శాతం) అడవులు విస్తరించినట్లు వెల్లడైంది. 2017 సంవత్సరం నుంచి అంటే ఈ నాలుగేళ్లలో 2.34 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగినట్లు కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్రయాదవ్ ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా 54.41 శాతం(మొదటిస్థానం), మంచిర్యాల 45.15శాతం(రెండోస్థానం), ఆదిలాబాద్ 42.79 శాతం(మూడోస్థానం), నిర్మల్ 32.62 శాతం(నాలుగో స్థానం) అడవులు ఉన్నాయి. జిల్లాలో దట్టమైన అడవులు 150.05 చదరపు హెక్టార్లు ఉండగా.. మధ్యస్త అడవులు 3,244.05, మైదానపు అడవులు 2,349.12 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
రికార్డుస్థాయిలో వర్షపాతం.. పెరిగిన భూగర్భజలాలు..
‘వృక్షో రక్షతి రక్షితః’ అన్నట్లు వృక్షాలను పెంచి సంరక్షించడం వల్ల అవి మనకు అధిక వర్షాన్ని కురిపించడానికి దోహదపడ్డాయి. మన వద్ద అడవులు అధికంగా ఉండడం, అటవీ ప్రాంతంలో చెక్డ్యాంలు, నీటి కుంటలు నిర్మించడం వల్ల వాతావరణంలో సమతుల్యత ఏర్పడి అధిక శాతం వర్షపాతం నమోదవడానికి కారణమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సగటు వర్షపాతం 1,104 మిల్లీ మీటర్లు కాగా.. మూడేళ్ల నుంచి సగటు వర్షపాతం కంటే అధికంగా 200-300 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది కూడా 1,350 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీనివల్ల భూగర్భజలాలు కూడా సగటు కంటే గణనీయంగా పెరిగాయి. ఈ యేడాది అత్యధికంగా 4.5 మీటర్ల భూగర్భజలాలు నమోదైనట్లు భూగర్భజలశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
హరితహారంతోనే అడవుల పెరుగుదల
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూరు, ఆసిఫాబాద్, కాగజ్నగర్, ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, జన్నారం, చెన్నూరు డివిజన్లు ఉన్నాయి. 2015 నుంచి 2021 వరకు అంటే ఏడు విడుతలుగా తెలంగాణ హరితహారంలో భాగంగా 15 కోట్ల మొక్కలను నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా 2015 సంవత్సరంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని దస్తురాబాద్లో మొక్క నాటారు. ఇక్కడ లక్ష మొక్కలు పెంచగా ఆ మొక్కలన్నీ పెరిగి ఇప్పుడు చిట్టడివిగా మారాయి. నాటిన మొక్కల సంరక్షణకు అటవీశాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. అటవీ ప్రాంతంలో చెక్డ్యాంలు, ఇంకుడుగుంతల నిర్మాణం, ఫెన్సింగ్, బేష్ క్యాంపులు, సీసీ కెమెరాలు, గడ్డి క్షేత్రాలు ఏర్పాటు చేసింది. అటవీ ప్రాంతంలో ఖాళీ ప్రదేశాలను గుర్తించి సీడ్బాల్స్(విత్తన బంతులు) పేరిట అడవిని పెంపొందించింది. అటవీ ప్రాంతంలో 200 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చెక్పోస్టు సిబ్బంది గస్తీ బృందాలను ఏర్పాటు చేసింది. కలప అక్రమ రవాణా, అడవుల నరికివేతపై దృష్టి పెట్టిన ప్రభుత్వం పీడీ చట్టాలను అమలు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దట్టమైన ప్రాంతమైన కవ్వాల్ అభయారణ్యాన్ని టైగర్ జోన్గా ప్రకటించింది అభివృద్ధి చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో అడవుల విస్తీర్ణం పెరగడమే కాకుండా అక్రమార్కులకు అడ్డుకట్ట పడింది.
వన్యప్రాణి, పక్షులకు స్థావరం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం పెరగడం, దట్టమైన అడవులు ఉండడంతో వన్యప్రాణులకు నిలయంగా మారింది. మహారాష్ట్రలోని సిరొంచ, గడ్చిరోలి ప్రాంతాల నుంచి పులులు టైగర్ జోన్లోకి ప్రవేశించి స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. దీనికితోడు అడవులు పెరగడం, అటవీ ప్రాంతంలో గడ్డిక్షేత్రాలు పెంచడం, సోలార్ ద్వారా నీటి వసతులు కల్పించడం వల్ల వన్యప్రాణులు సంఖ్య పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మన అటవీ ప్రాంతంలో 40 రకాల జంతువులు నివాసం ఉంటున్నాయి. దీనికితోడు దేశీయ పక్షులతోపాటు విదేశీ పక్షులు కూడా ఇక్కడే స్థావరం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వేలో 200 రకాల పక్షులు గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అడవుల్లో పులులు తిరగడం వల్ల అడవుల నరికివేతకు కూడా పరోక్షంగా దోహదపడింది.
భారీ సంఖ్యలో ఉద్యోగాల నియామకాలు..
తెలంగాణ ప్రభుత్వం హరితహారాన్ని నిర్వహిస్తూనే అడవుల సంరక్షణకు పెద్దఎత్తున ఉద్యోగాల నియామకం చేపట్టింది. గతంలో సీనియర్ ఉద్యోగులు మాత్రమే అడవులను పర్యవేక్షించేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐఎఫ్ఎస్ ఉద్యోగులను డివిజన్, జిల్లా స్థాయి అధికారులుగా నియమించింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 10 మంది ఐఎఫ్ఎస్లు విధులు నిర్వహిస్తున్నారు. దీనికితోడు 2017, 2019, 2021 ఫారెస్టు రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇందులో భాగంగా 20 మంది ఎఫ్ఆర్వోలు, 25 మంది డిప్యూటీ ఎఫ్ఆర్వోలు, 200 మంది ఎఫ్బీవోలు, 50 మంది ఎఫ్ఎస్వోలను కొత్తగా నియమించింది. వీరు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించి అడవులు, వన్యప్రాణుల రక్షణలో కీలక పాత్ర పోషించారు.
వన్యప్రాణాలు, పక్షిజాతులకు నిలయం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అటవీశాఖ నిర్వహించిన సర్వేలో 8-10 పులులు, 40 రకాల అటవీ జంతువులు, 200లకు పైగా పక్షి జాతులను గుర్తించినట్లు తెలిపారు. పక్షుల కోసం గడ్డి క్షేత్రాలు పెంచడం, పండ్ల మొక్కలు నాటడం, సోలార్తో నీటి పంపులు ఏర్పాటు చేయడం వల్ల వన్యప్రాణులకు ఆహారం, నీరు అందుబాటులో ఉండటమే దీనికి ప్రధాన కారణమని వారు పేర్కొంటున్నారు. – కోటేశ్వర్రావు, ఎఫ్డీవో, ఖానాపూర్.