ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆనంద్పూర్ గ్రామంలో పర్యటన
జైనథ్, జనవరి 22: పెన్గంగ ప్రాజెక్టు కాలువల ద్వారా ఆనంద్పూర్, హరియాలీ గ్రామాల్లోని రైతుల పంట పొలాలకు సాగునీరు అందేలా అధికారులు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదేశించారు. మండలంలోని ఆనంద్పూర్, హరియాలీ శివారులో పెన్గంగ ప్రాజెక్టు ఈఈ రవీందర్తో కలిసి శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివారులో భూగర్భ జలాలు నిల్వ ఉండేదని ప్రస్తుతం ఆ కాలువలో పెన్గంగ ద్వారా నీరు సరఫరా చేయాలన్నారు. ప్రత్యామ్నయంగా చిన్నచిన్న లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించేలా సర్వే చేసి 100 శాతం సాగు నీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట డీఈ మనోహర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు భోజారెడ్డి, ఎంపీపీ గోవర్ధన్ , టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఎస్ లింగారెడ్డి, ఏఈలు ప్రశాంత్, దిలీప్, నాయకులు సాయినాథ్, పోతన్న రాహుల్ రెడ్డి, సుభాష్ రెడ్డి, సురేశ్, రైతులు ఉన్నారు.
అభివృద్ధి పనులకు భూమిపూజ
ఆదిలాబాద్ రూరల్, జనవరి 22: మావల మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మండలంలోని బట్టిసావర్గాం గ్రామంలో చేపడుతున్న మురుగు కాలువ, సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.25 లక్షలు వెచ్చించి మురుగు కాలువ, రూ.9లక్షలతో సీసీ రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దర్శనాల సంగీత , ఏవన్, సర్పంచ్ రాగం గంగవ్వ, గోవర్ధన్, గణపతి రెడ్డి పాల్గొన్నారు.