గ్రామాల్లో హార్వెస్టర్లతో జోరుగా ధాన్యం నూర్పిడి
యంత్రాల వినియోగంతో తగ్గుతున్న ఖర్చు
దస్తురాబాద్, నవంబర్ 21 : పెరుగుతున్న ఆధునీకరణకు తగ్గట్టుగానే రైతులు కూడా యాంత్రీకరణ వైపు దృష్టి సారిస్తున్నారు. వానకాలంలో వరిని దాదాపు కోత యంత్రాలతోనే (హార్వేస్టర్లు) కోయిస్తున్నారు. దీంతో పనులు త్వరగా పూర్తి అవుతున్నాయని, కూలీల ఇబ్బంది కూడా తప్పిందని రైతులు తెలిపారు. ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్నందున పంటను కాపాడుకోవాలంటే ఇదే మంచి మార్గమని వారు భావిస్తున్నారు. ఈ సీజన్లో చిన్న, సన్నకారు రైతులు కూడా ఈ యంత్రాల సహాయంతో వరి కోతలు కోస్తున్నారు. వరి సాగు చేసే రైతులు ట్రాక్టర్లు, కోత యంత్రాల సహాయాన్ని తీసుకుంటున్నారు. కూలీల ఖర్చుతో పోలిస్తే యంత్రాలతోనే వ్యవసాయం సులువుగా ఉంటుందంటున్నారు.
యంత్రాలతో సులువుగా పనులు
మండలంలోని అన్ని గ్రామాల్లో వరి, పత్తి, నువ్వు పంటలు రైతులు సాగు చేశారు. ప్రస్తుతం వానకాలం పంటలో 7,800 ఎకరాలు వరిని రైతులు సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. వరి సాగు చేసే రైతులు నాట్లు వేసే సమయంలో మాత్రమే కూలీలతో పనులు చేయించుకుంటారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీల ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో రైతులు పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట కోత సమయంలో రైతులు కోత యంత్రాలు వాడుతున్నారు. టైర్ల యంత్రం అయితే గంటకు రూ. 2వేల నుంచి రూ. 2200 వరకు, చైన్ యంత్రం అయితే రూ. 3వేల నుంచి రూ. 3500 వరకు తీసుకుంటున్నారు. వ్యవసాయంలో యంత్రీకరణ అతి ముఖ్యమైనది. దుక్కి దున్నడం, కోతలు కోయడం వంటి పనులు యంత్రాలతో చేయడంతో ఆసక్తి చూపుతున్నారు. యంత్రాల ద్వారా అధిక సమయం వెచ్చించే పని తప్పిందని రైతులు అంటున్నారు.