ఎకరానికి 6-10 క్వింటాళ్ల దిగుబడి
మార్కెట్లో రూ.5 వేలు పలుకుతున్న ధర
బోథ్, నవంబర్ 21: సోయా పంట అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్నది. ఎకరానికి ఆరు నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా క్వింటాల్కు రూ.5 వేల వరకు ధర పలుకుతున్నది. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు పయనించాలని ప్రభుత్వం చేస్తున్న సూచనను పాటిస్తున్న రైతులకు సోయా లాభాలు తెచ్చి పెడుతున్నది. బోథ్ మండలంలో వానకాలం పంట కింద సుమారు 11,017 ఎకరాల్లో రైతులు సోయా సాగు చేశారు. పత్తితో పాటు కంది, సోయాబీన్ వేయాలని సర్కార్ సూచించడంతో రెండో అతి పెద్ద పంటగా సోయా పండించారు. జూన్ రెండో వారంలో వేసిన పంట ప్రస్తుతం 95 శాతం వరకు పూర్తయ్యింది. అధిక వర్షపాతం నమోదైన నేల స్వభావాన్ని బట్టి ఎకరాకు 6 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కలుపు నివారణ, గడ్డిమందు, కోతలు, నూర్పిడి చేయడం వంటి పనుల కోసం ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెట్టుబడి రూపేణా ఖర్చు చేశారు. వచ్చిన దిగుబడి ప్రకారం ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.35 వేల వరకు మిగులు కనిపిస్తున్నదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్లో అధిక రేటు పలుకుతుండడంతో వ్యాపారులు గ్రామాలకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీనికితోడు రైతులకు రవాణా చార్జీలు మిగులుతున్నాయి. ఈ ప్రాంతంలో వరి సాగు లేకున్నా ప్రతి యేటా వాణిజ్య పంటలైన పత్తి, సోయా పండిస్తూ లాభాలు గడిస్తున్నామని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రూ.1.50 లక్షలు మిగులుతున్నయ్..
తొమ్మిది ఎకరాల్లో సోయాబీన్ పంట సాగు చేశా. సుమారు 75 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. సరాసరి ఎకరాకు ఎనిమిది క్వింటాళ్లు పండిం ది. పెట్టుబడి కోసం రూ.2 లక్షల వర కు ఖర్చయినా మార్కెట్ ధరతో రూ.1.50 లక్షల వరకు మిగులుతున్నయ్. సోయాలో అంత ర పంటగా వేసిన కంది చేతికి వస్తే మరింత లాభం వస్తుంది.