మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 21 : అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఈ-శ్రమ్ పోర్టల్ ఏర్పాటు చేసిందని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ శాఖల కింద పని చేస్తున్న అసంఘటిత కార్మికులు వారి వివరాలను ఈ-శ్రమ్లో నమోదు చేయాలని సంబంధిత శాఖల జిల్లా అధికారులు వారి క్షేత్ర స్థాయి ఉద్యోగులకు ఆదేశించారు. వ్యవసాయ, అనుబంధ ఉపాధి వర్గాలు, భవన, అనుబంధ రంగాల వర్గాలు, మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు, వడ్రంగులు, ఇటుకబట్టీలు, క్వారీ, మిల్లు కార్మికులు అన్ని రకాల దినసరి కూలీలు వారి వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం లేని వారు, ఆదాయ పన్ను చెల్లించని వారి ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్తో అనుసంధానం కలిగిన బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ను తీసుకొని సమీపంలోని సీఎస్సీని సంప్రదించి ఉచితంగా తక్షణమే ఈ-శ్రమ్ కార్డును పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్మిక కమిషనర్ మహ్మద్ రఫీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి నరేందర్, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.