పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
తిమ్మాపూర్, గుడిపేటలో అభివృద్ధి పనులు ప్రారంభం
లక్షెట్టిపేట రూరల్, అక్టోబర్ 21: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని, ఇందులో భాగంగా మౌలిక వసతులు కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. గురువారం లక్షెట్టిపేట మండలంలోని తిమ్మాపూర్లో రూ.22 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను స్థానిక నాయకులతో కలిసి రిబ్బన్ కట్చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అంతర్గత రోడ్లు, లింక్ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో చేపట్టిన ప్రతి బ్రిడ్జి కింద చెక్ డ్యాములు నిర్మించినట్లు తెలిపారు. ఒక్కో చెక్డ్యాం కింద 30 నుంచి 40 ఎకరాల భూమి సాగవుతుందని తెలిపారు. గతేడాది వేసవి కాలంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు ఎత్తిపోయడం ద్వారా 18 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని వాడుకున్నామన్నారు. వానకాలం నాట్లు వేసేందుకు నీరు లేకపోవడంతో సీఎం కేసీఆర్కు విన్నవించి, కడెం ప్రధాన కాలువ ద్వారా 4 మండలాలకు సాగునీరు అందించామని తెలిపారు. అనంతరం తమ వార్డుకు సీసీ రోడ్డు వేయించినందుకు టీఆర్ఎస్ అభిమాని ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. అనంతరం అక్కడే పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను ఎమ్మెల్యే సన్మానించారు. పారిశుధ్య కార్మికుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అన్నం మంగ, జడ్పీటీసీ ముత్తె సత్తన్న, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీటీసీ గడుసు స్వప్న, తిమ్మాపూర్ సర్పంచ్ చుంచు రవి, ఉప సర్పంచ్ ముత్తె రాజ్కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షుడు అంకతి రమేశ్, గ్రామ అధ్యక్షుడు ఎంబడి భూమయ్య, ఇండ్ల లింగయ్య, యూత్ ప్రెసిడెంట్ నేరెళ్ల సురేశ్, బైరి మల్లేశ్, గడుసు సత్తన్న, ముక్కెర శంకరయ్య, చింతకింది గంగాధర్, ముడిమడుగుల తిరుపతి, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామ స్వరాజ్యమే కేసీఆర్ లక్ష్యం
హాజీపూర్, అక్టోబర్ 21 : గ్రామ స్వరాజ్యమే కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. గురువారం మండలంలోని గుడిపేట గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేక అభివృద్ధి నిధులు, గ్రామ పంచాయతీ నిధులు రూ.25 లక్షలతో గ్రామంలో నిర్మించిన సిమెంట్ రోడ్డును సర్పంచ్ లగిశెట్టి లక్ష్మి-రాజయ్య నాయకులతో కలిసి ప్రారంభించారు. అశోక చక్రవర్తి చేసిన పనులను మరిపించే విధంగా ముఖ్యమంత్రి ప్రతి గ్రామంలో హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గోళ్ల శ్రీనివాస్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు నయిం పాషాతో పాటు మండల నాయకులు ఉన్నారు.