పరిశీలించిన డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణ
కరీంనగర్ దిగువ మానేరు జలాశయంపై నిర్మాణం
నెల రోజుల్లో పూర్తికి చర్యలు
శ్రీరాంపూర్, అక్టోబర్ 21: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచన మేరకు సింగరేణి సీఎండీ శ్రీధర్ మార్గనిర్దేశంలో కరీంనగర్ దిగువ మానేరు జలాశంయంపై (నీటిపై తేలియాడే) సింగరేణి సంస్థ నిర్మించతలపెట్టిన 250 మెగావాట్ల (డీ.సీ) సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సర్వే ప్రారంభమైంది. ఇందులో భాగంగా గురువారం కరీంనగర్ దిగువ మానేరులో ఎరిసిస్ టెక్నాలజీస్ సంస్థ వారి మోటార్ బోట్లో జలాశయంలో చేపడుతున్న సర్వే పనులను (ఈఅండ్ఎం) సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. ఈ సర్వేను మరో నెల రోజుల్లోగా పూర్తి చేయాలని, ఆ వెంటనే నివేదిక సమర్పించాలని సంబంధిత ఏజెన్సీని ఆదేశించారు. తాము ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా జలాశయంలో పలు అంశాలపై సర్వే నిర్వహిస్తున్నామని, సర్వే అనంతరం సోలార్ ప్లాంట్ నిర్మాణ శైలిని రూపొందిస్తామని డైరెక్టర్ తెలిపారు. సర్వేలో భాగంగా జలాశయంలో నీటి పరిమాణం, నీటి వేగం, తదితర అంశాలను పరిశీలించే హైడ్రో గ్రాఫిక్, నీటి అడుగు భాగంలోని భూమి ఎత్తు పల్లాలు తదితర అంశాలను పరిశీలించే ఖ్యాతిమెట్రిక్, నీటి కింద ఉన్న భూమి లోపలి పొరల స్థితి గతులను అధ్యయనం చేసే బెడ్ సాయిల్ సర్వేలు నిర్వహిస్తున్నారన్నారు.
వీటి ఆధారంగా ప్లాంట్ను జలాశయంలో ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఏయే కొలతలతో ఏర్పాటు చేయాలనేది నిర్ధారిస్తారని చెప్పారు. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నీటిపై తేలియాడేదే అయినప్పటికీ దీనిని స్థిరంగా ఉంచడం కోసం ప్లాంట్కు నలువైపులా భూమి లో పల లంగర్ వేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటికే సూత్రప్రాయంగా సింగరేణి సంస్థ మానేరు జలాశయం నీటిపై ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆనుమితించగా.. దీనికి సం బంధించి ఇరిగేషన్, మత్స్య శాఖల వారు కూడా ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పారు. ప్రభు త్వం నుంచి అనుమతి లభించగానే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మాణానికి దేశ వ్యాప్తంగా నిర్మాణ సంస్థ నుంచి టెండర్లు ఆహ్వానించనుందని డైరెక్టర్ పేర్కొన్నారు. కాగా.. ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ నియామకం కోసం ఇటీవలే టెండర్లను పిలిచామన్నారు. ఈ ప్లాంట్ ప్రారంభమైతే దేశంలోనే జలాశయం నీటిపై తేలియాడే తొలి ప్లాంట్గా సింగరేణి సోలార్ నిలువనుందని పేర్కొన్నారు. ఇక్కడ డిప్యూటీ జీఎం (ఈఅండ్ఎం) ఎస్ శ్రీనివాస్, ఎస్ఈ ఏ నటరాజప్రసాద్, ఏరిసిస్ నుంచి పీ నవీన్, కే వర్మ ఉన్నారు.