వరికి ప్రత్యామ్నాయంగా సూచిస్తున్న రాష్ట్ర సర్కారు
నిర్మల్ జిల్లా భూములు అనుకూలమంటున్న వ్యవసాయశాఖ
లక్ష ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు ఈ ఏడాది 10 వేల ఎకరాల్లో..
బీరవెల్లి వద్ద భారీ నర్సరీ ఏర్పాటు
సిద్ధమవుతున్న 4.65 లక్షల మొక్కలు
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే వీలు
అవగాహన కల్పిస్తున్న అధికారులు.. ఆసక్తి చూపుతున్న రైతులు
ఇప్పటికే 1200 మంది రైతుల నుంచి దరఖాస్తులు
నిర్మల్లో 60 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు
నిర్మల్ (నమస్తే తెలంగాణ)/కడెం, జనవరి 21 : దొడ్డురకం వడ్లు కొనబోమంటూ కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ‘ప్రత్యామ్నాయ’ సాగును ప్రోత్సహిస్తున్నది. ఎప్పుడూ ఒకేరకమైన పంటతో నష్టపోయే ప్రమాదముండగా, మార్పిడిపై దృష్టి పెట్టింది. ఈ మేరకు మార్కెట్లో డిమాండ్ ఉన్న ‘పామాయిల్’ను సూచిస్తున్నది. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలం పాటు ఆదాయం పొందే అవకాశముండగా, ఊరూరా అవగాహన కల్పిస్తూ రైతాంగాన్ని చైతన్యపరుస్తున్నది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు రూపొందిస్తుండగా, ఈ ఏడాది 10 వేల ఎకరాల్లో వేసేందుకు సన్నద్ధమవుతున్నది. అందుకనుగుణంగా సారంగాపూర్ మండలం బీరవెల్లి వద్ద భారీ నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్ర భుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రైతులకు అధిక లాభాలను ఇచ్చే పంటలను వేసేలా ప్రోత్సాహకాలను అందజేస్తున్నది. ము ఖ్యంగా వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డి మాండ్ ఉన్న పంటలను వేయాలని రైతులకు సూ చిస్తుంది. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు రైతులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలంగా ఆదాయాన్నిచ్చే ఆయిల్పామ్ సాగుకు రైతులను సన్నద్ధం చేస్తున్నా రు. మున్ముందు జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో ఆయిల్పామ్ సాగయ్యే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు అవసరమైన భారీ నర్సరీని సారంగాపూర్ మండలం బీరవెల్లి వద్ద ఏర్పాటు చేశారు.
ఆయిల్పామ్తో అధిక లాభాలు
ఆయిల్పామ్ సాగుకు జిల్లా భూములు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు దాదా పు 12 కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పం దం కుదుర్చుకున్నాయి, టన్నుకు రూ. 15 వేల ధర నిర్ణయించింది. ఎకరా సాగుకు అయ్యే ఖర్చు రూ. 30 నుంచి 35 వేలు అవుతాయి. పంట వేసిన నా లుగో సంవత్సరం నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. మొక్క నాటిన నాలుగో సంవత్సరంలో ఎకరాకు నాలుగు టన్నులు, ఐదో సంవత్సరంలో ఆరు నుంచి ఏడు టన్నులు, ఆరో యేట నుంచి 9 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి ఎకరానికి 50 మొక్కల వరకు నాటుకోవచ్చు. సమాంతర త్రి భూజాకార పద్ధతిలో 9 మీటర్ల దూరంలో నాటాలి. ఒక్కో మొక్కకు 60 సెంటిమీటర్ల లోతు గుంత తవ్వాలి. నర్సరీలో ఏడాదిపాటు పెరిగిన మొక్కలను మాత్రమే నాటాల్సి ఉంటుంది. 1.2 మీటర్ల ఎత్తు కలిగిన మొక్కలను నాటడం వల్ల ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యతను ప్రీ యూనిక్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించింది. దీంతో సదరు కంపెనీ మొక్కల పెంపకం కోసం బీరవెల్లి సమీపంలో పెద్ద ఆయిల్ పామ్ నర్సరీని ఏర్పాటు చేసింది.
4.65 లక్షల మొక్కలు సిద్ధం
నిర్మల్ జిల్లాలో బీరవెల్లిలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ నర్సరీ రాష్ట్రంలోనే అతిపెద్దది. ప్రస్తుతం ఇక్క డ 4 లక్షల 65 వేల మొక్కలు సిద్ధం చేస్తున్నారు. 2022-23 సంవత్సరానికిగాను దాదాపు 10 వేల ఎకరాలకు సరిపడా మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం అసరమైన రైతులకు మాత్రం ఆర్మూర్కి చెందిన నర్సరీ నుంచి అందజేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో 60 ఎకరాల్లో ప్రభుత్వం ఆయిల్ పామ్ కంపెనీని ఏర్పాటు చేసి కొనుగోలు చేయనున్నది. ఇందుకు సంబంధించిన స్థల సేకరణ సైతం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కడెం మండలం నచ్చన్ఎల్లాపూర్లోని పట్టు పరిశ్రమ శాఖకు చెందిన స్థలంలో అధికారులు ఏడాదిన్నర క్రితం ఎకరం సాగు చేశారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి పూత దశలో ఉన్నాయి. ఇప్పటికే ఆయా మం డలాల నుంచి రైతులను ఇక్కడికి తీసుకొచ్చి సాగు విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. పైగా ఆయిల్పామ్ తోటలకు అడవి పందులు, కోతుల బెడద కూడా లేకపోవడంతో రైతులు ఈ మొక్కలను నాటేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అంతర పంటలతో అదనపు ఆదాయం
ఆయిల్ పామ్లో అంతర పంటలుగా పసుపు మి ర్చి, కూరగాయలు, మక్క, పొద్దుతిరుగుడు, సో యాబీన్, పెసళ్లు, మినుములు, నువ్వులు, వేరుశనగ తదితర పంటలు వేసుకోవచ్చు. ఆయిల్ పామ్ మొక్కల మధ్య 9 మీటర్ల దూరం ఉంటుంది కా బట్టి నాలుగేళ్ల వరకు ఇందులో అంతర పంటల సాగుకు ఇబ్బందులుండవు. ఆయిల్ పామ్ సాగు వల్ల రైతులకు చీడపీడల బాధ అసలు ఉండదు. ఇతర పంటల సాగుకు అవసరమైన ఎరువులను 30 శాతం వినియోగిస్తే సరిపోతుంది. వరితో పోల్చితే చీడపడలు, ఎరువుల ఇబ్బందులుండవు.
1200 మంది రైతుల నుంచి దరఖాస్తులు
2022-23 సంవత్సరానికిగాను జిల్లాలో దరఖాస్తుల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఉద్యానవనశాఖ, ప్రీ యూనిక్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (పీ యూ), వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆయా క్లస్టర్ల పరిధిలోని ఏఈవోలతో కలిసి పీయూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ క్లస్టర్ సిబ్బంది దరఖాస్తులు స్వీకరించి ఉద్యానవన శాఖ ద్వారా రైతులను ఎంపిక చేస్తున్నారు. ఈ ఏడాదికి జిల్లాలో మొత్తం 10 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేలా వా రు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 5 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు 1200 మం ది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను కంపెనీకి సంబంధించిన పోర్టల్లో ఆన్లైన్ చేసిన అనంతరం రైతులకు గుర్తింపు కార్డులను అందజేయన్నుట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు
ఆయిల్ పామ్సాగు చేసే రైతులకు అవసరమైన డ్రిప్, ఇత పరికరాలకు పెద్ద ఎత్తున సబ్సిడీని అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొక్క లు నాటిన నాలుగేళ్ల వరకు అవసరమైన ఎరువులను రాయితీపై అందించనున్నది. ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటలు వేసేందుకు రైతబంధుతో పాటు అదనంగా ఎకరానికి రూ. 5 వేలను ప్రోత్సాహకంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది.