రాయితీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చాం
ఇచ్చిన హామీని మరిచిన బీజేపీ ఎంపీ
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఎదులాపురం, జనవరి 21 : ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునఃప్రారంభంపై కేంద్ర ప్రభుత్వం, ఎంపీ సోయం బాపురావ్ నోరు మెదపడంలేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే, నితిన్ గడ్కరీని ఢిల్లీలో కలిసి సీసీఐని పునఃప్రారంభించాలని పలుమార్లు విన్నవించినట్లు గుర్తుచేశారు. ఇదే విషయమై సీఎం కేసీఆర్ కూడా ప్రధాని మోడీని కలిశారని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి సీసీఐ ప్రారంభానికి అవసరమయ్యే అన్ని రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చినా కేంద్రం నోరుపెదపడం లేదని పేర్కొన్నారు. జనవరి 1న కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, మహేంద్ర నాథ్ పాండేకు లేఖ రాసినట్లు గుర్తుచేశారు. 2016,17లో అప్పటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హంస్రాజ్ గంగార్ అహీర్ ఆదిలాబాద్ పట్టణంలో పర్యటించి, సీసీఐ పరిసరాలను సందర్శించారని తెలిపారు. పునఃప్రారంభిస్తామని జిల్లా ప్రజలకు హామీ కూడా ఇచ్చారని గుర్తుచేశారు. స్థానిక బీజేపీ నాయకులు అనేకసార్లు ప్రెస్మీట్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం సీసీఐ పునఃప్రారంభానికి సానుకూలంగా ఉందరని తెలిపారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కూడా ఎంపీ సోయం బాపురావ్ ప్రజలకు, యువతకు ఇదే హామీ ఇవ్వడం వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. జిల్లా ప్రజలకు ఆయన సమాదానం చెప్పడం బాధ్యత కాదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకపోవడం ఆయన అసమర్ధత కాదా అని నిలదీశారు.
అభివృద్ధి పనులకు భూమి పూజ..
ఆదిలాబాద్ రూరల్, జనవరి 21 : పట్టణలోని డీఆర్డీవో కార్యాలయం నుంచి శాంతినగర్ వరకు రోడ్డు వెడల్పు, బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు అనేక రోడ్లను బీటీ రోడ్లుగా మార్చినట్లు చెప్పారు. పట్టణంలోని 49 వార్డుల్లో ఎటు చూసినా అభివృద్ధి కనబడుతుందన్నారు. 72 ఏండ్ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేయలేని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం 7 ఏళ్లలో చేసి చూపించిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పట్టణ రహదారులను బీటీ రోడ్లుగా మార్చేందుకు రూ.40 కోట్లతో పనులు చేపడతున్నట్లు చెప్పారు. కేంద్రీయ విద్యాలయం కోసం 10 ఎకరాల స్థలం కేటాయించినప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంలేదన్నారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న భవనంలోనే విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నా ఆ పార్టీ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణాధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్ రాజు, బండారి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
చిరువ్యాపారులకు మాస్కుల పంపిణీ..
పట్టణంలోని చిరువ్యాపారులకు ఎమ్మెల్యే మాస్కులను పంపిణీ చేశారు. ప్రధాన మార్కెట్లలో తిరుగుతూ ప్రజలకు కొవిడ్ నిబంధనలపై వివరించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. ముఖ్యంగా చిరువ్యాపారులు తప్పకుండా మాస్కులు ధరించాలని, మాస్కులు ధరించిన వారికే కూరగాయలు, వస్తువులు విక్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.