భీంపూర్, జనవరి21: అడవికి దగ్గరగా గుట్టమీద ఉన్న తమకు తరాలుగా మంచినీటికోసం ఇబ్బంది ఉండేదని ఇప్పుడు భగీరథ జలాన్ని గుట్టపైకి పంపింగ్ చేసి ఇంటింటికీ కనెక్షన్ ఇవ్వడంతో కష్టాలు తీరాయని భీంపూర్ మండలం కరంజి(టీ) పంచాయతీ పరిధిలోని రాజులవాడి గిరిజనులు ముక్తకంఠంతో అధికారులకు తెలిపారు. గిరిజన గ్రామాన్ని మిషన్ భగీరథ అధికారుల బృందం శుక్రవారం పరిశీలించింది. డ్రోన్ కెమెరాతో గ్రామ ముఖ చిత్రం, భగీరథ నీరు చేరుతున్న తీరును చిత్రీకరించారు. భగీరథ జలం పరిశీలించారు. ఈ గ్రామంలో ఉన్న 49 ఇళ్లకు వెళ్లి మహిళల అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ నీటితో సీజనల్ వ్యాధులు బాగా తగ్గాయని, గుట్టకిందకి దిగి వ్యవసాయబావి నుంచి నీటిని తెచ్చుకునే ఇబ్బంది తప్పిందని ఈ సందర్భంగా మడావి లక్ష్మీబాయి సహా అన్ని కుటుంబాల వారు అధికారులతో చెప్పారు. ఈ బృందంలో మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు, జేఈ చంద్రశేఖర్ సిబ్బంది ఉన్నారు. అధికారుల వెంట జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, సర్పంచ్ జి.స్వాతిక, ఉపసర్పంచ్ ఆకటి లక్ష్మీబాయి, కార్యదర్శి నితిన్, నాయకులు జి.నరేందర్యాదవ్, ఆకటి నరేందర్రెడ్డి ,మడావి సంతోష్ , మర్ల వినోద్యాదవ్,బక్కి సతీష్యాదవ్ ,మడావి ధావు, లింగు,ఖేత్రు తదితరులున్నారు.