ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
రిమ్స్ సందర్శన.. ఆక్సిజన్ ప్లాంట్, వార్డుల పరిశీలన
ఎదులాపురం, జనవరి 21 : కొవిడ్ బాధితులకు రిమ్స్లోని కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్తో కలిసి శుక్రవారం రిమ్స్ను సందర్శించారు. ముందుగా ఆక్సిజన్ ప్లాంట్లు, వాటి పనితీరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ప్లాంట్లకు నోడల్ అధికారిని నియమించాలని డైరెక్టర్ జైసింగ్కు సూచించారు. అనంతరం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను పరిశీలించి, వివిధ రకాల పరీక్షల యంత్రాలను, సిబ్బంది పని తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి కొవిడ్ ఓపీ, పరీక్షల విధానం, రిజల్ట్ వివరాలను ఆయా విభాగాల సిబ్బంది నుంచి తెలుసుకున్నారు. ఆ తర్వాత వార్డుల్లో పర్యటించి రోగులకు అందిస్తున్న చికిత్సపై వాకబు చేశారు. కొవిడ్ కేం ద్రంలో పాజిటివ్ బాధితులకు అందిస్తున్న వై ద్యం, భోజనం, పారిశుధ్యం, తదితర విషయాలపై రిమ్స్ డైరెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రిమ్స్లో ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందిస్తారని, ప్రజలు భయాందోళన చెందవద్దని సూచించారు. వైద్యు లు అందించే కిట్లను ఐదు రోజుల పాటు విధిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్, రిమ్స్ వైద్యులు, సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.