నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్
జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 20 : శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులను ఆప్యాయంగా పలుకరించి, ఓపిగ్గా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఫిర్యాదులను వివరించారు. సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మంచి మార్గంలో ఉన్న ప్రజల కోసమే ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. జిల్లాలో విజువల్ పోలీసింగ్ కొనసాగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కాలనీల్లో సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడులు చేయవద్దని సూచించారు. పోలీస్ సాయం కావాలనుకునే వారు స్టేషన్లో నిర్భయంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన పోలీసు వ్యవస్థను అందించి, పోలీసుల గౌరవం మరింత పెంచేలా కృషిచేస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందించేందుకు జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులను నేరుగా స్వీకరిస్తూ ప్రతీ సోమవారం ప్రజా దివస్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు.