స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా అభివృద్ధి పనుల పరిశీలన
తలమడుగు, డిసెంబర్ 20 : స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. ఈ మేరకు తలమడుగు మండలంలోని కజ్జర్లలో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్ల వాడకాన్ని బృందం సభ్యుడు కిషోర్ పరిశీలించారు. ఇంటింటా తిరుగుతూ మురుగు కాలువలను శుభ్రం చేస్తున్నారా.., ప్రతి రోజూ పంచాయతీ సిబ్బంది చెత్తను తీసుకెళ్తున్నారా.., ఇంటి వద్ద గల మరుదొడ్లు ఉపయోగంలో ఉన్నాయా.., తదితర అంశాల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛతలో పలు అంశాలను పంచాయతీ సిబ్బంది, మండల అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పరిశుభ్రత బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట సర్పంచ్ మోట్టె వెంకటమ్మ, ఉప సర్పంచ్ కాకెర్ల ప్రశాంత్, ఎంపీడీవో రమాకాంత్, ఎంపీవో దిలీప్, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ సురుకుంటి వెంకట్ రెడ్డి, హెచ్ఎం పద్మజ, చింతలపెల్లి దేవారెడ్డి, మోట్టె కిరణ్ తదితరులు ఉన్నారు.
మరుగుదొడ్డి నిర్మించుకోవాలి..
ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 20 : ఉట్నూర్ మండలం ఉమ్రి పంచాయతీ పరిధిలోని సాలేగూడలో కేంద్ర బృందం సభ్యుడు భరత్కుమార్ పర్యటించారు. గ్రామంలోని పరిసరాలను, బయోగ్యాస్ ప్లాంట్ను, ఇంకుడు గుంతలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇం టింటా మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో తిరుమల, ఎంపీవో మహేశ్, సర్పంచ్ విఠల్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.