ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా శంషాబాద్లో పాడి పశువుల వసతిగృహం ప్రారంభం
బేల, డిసెంబర్ 20: రాష్ట్రంలోని పాడి రైతులకు రుణాలు అందించి ప్రోత్సహిస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. బేల మండలం శంషాబాద్ గ్రామంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా నిర్మించిన పాడి పశువుల వసతి గృహం, సమగ్ర వ్యవసాయం కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ పశువుల వసతి గృహం ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. గ్రామ స్థాయి పార్టీ, రైతు కమిటీలతో చర్చించి వారికి అవగాహన కల్పించడంతో పాటు ప్రతి గ్రామంలో ఈ పశువుల వసతి గృహం ఏర్పాటు చేయడానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఐఆర్డీవో సంస్థ వారిని అభినందించారు. రాష్ట్ర డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి మాట్లాడుతూ పాలను విజయ డెయిరీకి పోసి, రైతులకు ప్రోత్సాహకాలు అందేలా చూడాలని అన్నారు. నాలుగు నెలల పాటు విజయ డెయిరీకి పాలు పోసినట్లయితే వారికి ప్రతి లీటరుకు రూ.4 చొప్పున రాయితీతో పాటు, రైతులకు 50 శాతం రాయితీతో గడ్డి విత్తనాలు అందజేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఈ క్యాటిల్ హాస్టల్ను ఏర్పాటు చేసి రైతులకు పాడి పరిశ్రమలపై అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పాడి వసతి గృహం ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, టీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, వట్టిపెల్లి ఇంద్రశేఖర్, ప్రమోద్ రెడ్డి, విపిన్ ఖోడే, తన్వీర్ఖాన్, సంతోష్ బెదూడ్కర్, మంగేశ్ ఠాక్రే, వి శాల్ గోడె, ఐకేపీ సీసీ శరత్రెడ్డి, స్త్రీనిధి బ్యాంకు మేనేజర్ సంతోష్ , తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ గోపి, ఐఆర్డీవో ప్రతినిధి రాఘవేంద్రరావు, రాష్ట్ర ఇన్చార్జి మురళీకృష్ణ, జిల్లా ఆధికారి నరేందర్, మండల స్థాయి సభ్యుడు రమేశ్, అధికారులు నాయకులు, రైతులు పాల్గొన్నారు.
కుమ్రం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి
కుమ్రం భీం, కుమ్రం సూరు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బేల మండలం దుబ్బగూడ గ్రామంలో కుమ్రం సూరు విగ్రహాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదివాసుల కోసం కృషి చేస్తున్నారన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఎస్టీ కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ కేంద్రాలకు పక్క భవనాలు నిర్మించామని తెలిపారు. దుబ్బగూడలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి మాట్లాడుతూ యువత మహనీయుల అడుగు జాడల్లో నడవాలని సూచించారు. అనంతరం దుబ్బగూడ నుంచి మసాల(కే) గ్రామం వరకు చేపట్టనున్న రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, నాయకులు మెట్టు ప్రహాలాద్, కొడప సోనేరావు, సతీశ్ పవార్, సకారాం, రాందాస్, జంగు, ఉపసర్పంచ్ దుర్పాతాబాయి, ఆదివాసీ సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 20: తమకు వేతనాలు పెంచినందుకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సోమవారం జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను కలిసి శాలువా కప్పి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 80 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు పని చేస్తున్నారని, వారికి గతంలో రూ.4500 వేతనం అందేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ హయాంలో వారి వేతనాలను రూ.13600 వరకు పెంచిందని తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగులకు చెల్లించే వేతనాల్లో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటా రూ.2700 మాత్రమే పరిమితమైందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి, అంగన్వాడీ టీచర్లు రాధ, కవిత, రమా, తదితరులు పాల్గొన్నారు.