నిర్మల్టౌన్, డిసెంబర్ 20: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో దళిత బంధు పథకం కింద 300 మంది లబ్ధిదారులను ఎంపిక చేసేలా కసరత్తు చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో దళిత బంధు పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలన్నారు. ఈ పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. ఎంపిక చేసిన వ్యాపారంలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. యాసంగిలో వరి సాగు చేయవద్దని, ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఉద్యోగుల విభజన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.