ఆసిఫాబాద్,డిసెంబర్20 : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం అదనపు కలెక్టర్లు రాజేశం, వరుణ్రెడ్డితో కలిసి కొవిడ్ వ్యాక్సినేషన్, ధాన్యం కొనుగోలు, ఓటరు జాబితా, ధరణి, కల్యాణలక్ష్మి తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని వైద్యారోగ్యశాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల వారీగా వ్యాక్సిన్ తీసుకున్న వారు, టీకా వేసుకోని వారి వివరాలతో నివేదిక తయారు చేయాలన్నారు. ఇంటింటా సర్వే నిర్వహించి వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి స్టిక్కర్ అతికించాలన్నారు. ప్రతి రోజు 15 వేల డోసులు అందించేలా కార్యచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయబోమని స్పష్టం చేసినందున రైతులు యాసంగిలో ఇతర పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. ముందస్తు ఒప్పందం చేసుకున్న రైతులు మాత్రమే వరి సాగు చేయాలని తెలిపారు. దళిత బంధు పథకంలో భాగంగా నియోజవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. నలుగురు/ ఐదుగురు కలసి ఒక స్కీం ఎంపిక చేయాలని, అన్ని యూనిట్లు విజయవంతమయ్యేలా అధికారులు చొరువ తీసుకోవాలని సూచించారు. .జిల్లాలో ఓటరు జాబితా తయారీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వారి వివరాలు నమోదు చేసుకొని ఓటు హక్కు పొందేలా అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణలను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రత్నమాల, ఎస్సీ సంక్షేమాధికారి సజీవన్, జిల్లా వైద్యాధికారి మనోహర్, డీఆర్డీవో సురేందర్,ఆర్డీవోలు దత్తు, చిత్రు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.