ఆదిలాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రం ప్రభుత్వ తీరుపై గులాబీ దళం గర్జించింది. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఊరూరా మోడీ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి.. ప్రధాన కూడళ్ల వద్ద దహనం చేశారు. ‘బీజేపీ హటావో.. కిసాన్ కో బచావో.. రైతు వ్యతిరేక బీజేపీ డౌన్ డౌన్.. పంజాబ్లో వడ్లు కొంటరెట్లా.. తెలంగాణలో కొనరెట్లా.. అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎడ్లబండ్లతో ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. రహదారులపై భైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు, రైతులు, గులాబీ శ్రేణులు తరలిరాగా.. మంత్రి అల్లోల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో వడ్లను కొనుగోలు చేసే వరకు ఆందోళనలు నిర్వహిస్తామని రైతులు తెలిపారు.
తెలంగాణ రైతులపై కేంద్ర సర్కారు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ చావు డప్పు కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్ర సర్కారు సూచనల మేరకు ఊరూరా నల్లబ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. కేంద్ర సర్కారు యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి, రైతులను నట్టేట ముంచుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడుతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అండగా ధర్నా చేసింది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని, ఆయన రైతు పక్షపాతి అని కొనియాడారు. ఆయా చోట్ల రైతులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. నిర్మల్, సారంగాపూర్లో నిర్వహించిన కార్యక్రమాల్లో రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, ఆదిలాబాద్లో ఎమ్మెల్యే జోగు రామన్న, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, ఇచ్చోడలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, భైంసాలో మథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఖానాపూర్లో ఎమ్మెల్యే రేఖానాయక్, నార్నూర్ ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నారు. నిరసన ర్యాలీ, చావుడప్పు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో వడ్లు కొనుగోలు చేసే దాకా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని రైతులు తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు దండేపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు స్థానిక నాయకులతో కలిసి ర్యాలీ తీశారు. దండేపల్లిలో అంబేద్కర్, గాంధీజీ, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అంబేద్కర్ విగ్ర హం నుంచి ఎడ్ల బండితో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. కోటపల్లిలో ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమా ర్ రైతులతో కలిసి పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చే శారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్కుమార్ పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఆయా చోట్ల రాష్ట్ర రైతు బంధు సమితి సభ్యు డు వాలా శ్రీనివాస్రావు, అధ్యక్షుడు మోటపలుకల గురువయ్య, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
జిల్లా కేంద్రంతో పాటు రెబ్బెనలో నిర్వహించిన చావు డప్పు కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు. ర్యాలీ తీస్తూ బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కౌటాల మండల కేంద్రంలోని తన నివాసం నుంచి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శ్రేణులతో కలిసి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంఆర్ఐ దేవేందర్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సిర్పూర్-యు, జైనూర్ మండల కేంద్రాల్లో నిర్వహించిన కార్యకమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
యాసంగిలో వరి వద్దు : మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
కేంద్ర ప్రభుత్వ వైఖరితో రైతులు నష్టపోయో ప్రమాదముందని, యాసంగిలో వరి పంట వేయవద్దని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. నిర్మల్, సారంగాపూర్లో నిర్వహించిన చావుడప్పు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర సర్కారు ఎన్నికలు జరిగే పంజాబ్ రాష్ట్రంలో వడ్లు కొనుగోలు చేస్తున్నదని, తెలంగాణలో మాత్రం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. బీజేపీ సర్కారు ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. వడ్లు కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులను కలవడానికి ప్రయత్నిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు యాసంగిలో వరి వేయాలని రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి మాటలు నమ్మి నష్టపోవద్దని కోరారు. యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. యాసంగిలో వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఇతర పంటలు వేసుకోవాలన్నారు. తాను సైతం వరికి బదులు ఇతర పంటలు వేసినట్లు తెలిపారు.