నిర్మల్ టౌన్, నవంబర్ 20: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు సమగ్ర ఓటర్ల జాబితాను రూపొందించాలని రాష్ట్ర ఎలక్ట్రోరల్ పరిశీలకుడు సుదర్శన్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో ఓటరు నమోదు ప్రక్రియ, సమగ్ర ఓటర్ల జాబితాపై జిల్లా అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఎన్నికల నియమావళి కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఓటరు నమోదుపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని, తప్పొప్పులు సవరించాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల మార్పిడి దరఖాస్తులను పరిశీలించాలన్నారు. అంతకుముందు నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో రమేశ్ రాథోడ్, సిబ్బంది ఉన్నారు.