బోథ్, అక్టోబర్ 20: తెలంగాణలోని పురాతన ఆలయాలకు పూర్వ వైభవం కల్పిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం బోథ్లోని పంచముఖి హనుమాన్ ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గతంలో 33 శాతం భాగస్వామ్యం చెల్లిస్తేనే ఆలయాల కోసం నిధులు మంజూరు చేసేవారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ 20 శాతం భాగస్వామ్యం చెల్లిస్తే నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారన్నారు. దీప, ధూప నైవేద్యాల కోసం ఆలయాలకు నెలనెలా నిధులు కేటాయిస్తున్నామన్నారు. బోథ్లో హనుమాన్ ఆలయ నిర్మాణం కోసం రూ. 22 లక్షలు మంజూరు చేశామని పేర్కొన్నారు. మరో రూ. 20 లక్షల కోసం భాగస్వామ్యం డబ్బులు చెల్లిస్తే వెంటనే మంజూరు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తున్నామన్నారు. అనంతరం మంత్రితో పాటు ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, పీఏసీఎస్ చైర్మన్ కే ప్రశాంత్, సర్పంచ్ సురేందర్యాదవ్, ఆత్మ చైర్మన్ సుభాష్, ఆలయ కమిటీ చైర్మన్ కే విశ్వనాథ్, టీఆర్ఎస్ కన్వీనర్ రుక్మణ్సింగ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ ఎంపీ పూజలు
హనుమాన్ ఆలయంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ పంచముఖి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన అనంతరం పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎంపీని సన్మానించారు.
కుమ్రం భీంను ఆదర్శంగా తీసుకోవాలి
ఉట్నూర్ రూరల్, అక్టోబర్ 20: కుమ్రం భీంను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. భీం వర్ధంతి సందర్భంగా బుధవారం శ్యాంపూర్లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లిక, టీఆర్ఎస్ నాయకులు కాటం రమేశ్, శ్యాంరావ్, రాజుపటేల్, భీంరావ్, సోనేరావ్, న్యానోబ, గ్రామస్తులు పాల్గొన్నారు.