న్యూఢిల్లీ : కరోనాకు వ్యతిరేకంగా ఎక్కువ సామర్థ్యాన్ని నిర్వహించడానికి బూస్టర్ డోస్ అవసరమా? అనే అంశంపై భారత్, అమెరికాతో పాటు పలు దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. దేశంలో టీకా డ్రైవ్ ప్రారంభించి ఐదు నెలలవుతోంది. ప్రభుత్వం, వైద్యులు, శాస్త్రవేత్తలు ప్రతి ఒక్కరినీ ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బూస్టర్ డోసు వైపు దృష్టి సారిస్తున్నారు. యూఎస్, యూరోపియన్ దేశాల్లో సహా భారత్తో పాటు పలు దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయని ఢిల్లీలోని ఎయిమ్స్కు చెందిన మెడిసిన్ విభాగం వైద్యుడు డాక్టర్ సంజీవ్ సిన్హా తెలిపారు.
రాబోయే రెండు మూడు నెలల్లో మిరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయని, అప్పుడు బూస్టర్ మోతాదుపై నిర్ణయం తీసుకోవచ్చన్నారు. అంతా పరిశోధనలపై ఆధారపడి ఉంటుందని, ఎయిమ్స్లో కూడా బూస్టర్ మోతాదుపై కొంత పని జరుగుతుందని చెప్పారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు కరోనాకు వ్యతిరేకంగా దేశంలో వినియోగానికి అనుమతి పొందాయని డాక్టర్ సిన్హా తెలిపారు. ప్రముఖ మెడికల్ జర్నల్ అధ్యయనం తర్వాత కొవిషీల్డ్ రెండు మోతాదుల మధ్య విరామం పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
కొత్త కేసుల సంఖ్య తగ్గినందున కొవిడ్కు వ్యతిరేకంగా ప్రజలు జాగ్రత్తలు కొనసాగించాలని, ఆత్మసంతృప్తి చెందవద్దని డాక్టర్ సిన్హా కోరారు. ‘ఇది కీలక సమయం.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు కొవిడ్కు తగిన ప్రవర్తనను అసురించాలి. అత్యవసరమైతేనే బయటకు రావాలి. ఇంట్లో నుంచే పని చేయాలి. తప్పనిసరైతేనే కార్యాలయానికి వెళ్లండి.. ఆపై కలిసి భోజనం చేయకుండా చూసుకోండి’ అని సిన్హా సూచించారు.