గణపురం, మార్చి 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి పల్లె ప్రగతితో కొత్తరూపు సంతరించుకుంది. గ్రామాల సర్వతోముఖాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం ఎంతో మార్పు తీసుకొచ్చింది. మొన్నటివరకు కర్కపల్లి గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న ఈ గ్రామంలో అనేక సమస్యలుండేవి. సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధతో ఇప్పుడు అన్ని రంగాల్లో ప్రగతి సాధించి జిల్లాలో ఆదర్శ జీపీగా రికార్డులోకికెక్కింది. పల్లె ప్రగతికి ముందు ఊరంతా చెత్తాచెదారంతో నిండి ఉండేది. ఖాళీ ప్రదేశాల్లో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు కనిపించేవి. ఇప్పుడు చెత్తాచెదారమే కాదు.. ఏ వీధి, ప్రధాన రహదారిపై చూసినా చెత్త మచ్చుకైనా కనిపించదు. గ్రామస్తుల సహకారంతో గ్రామం పరిశుభ్రంగా మారింది.
‘ప్రగతి’ పనులు ఇలా..
గ్రామంలో ‘పల్లె ప్రగతి’ని పక్కాగా అమలుచేశారు. మూడు గుంటల్లో రూ.2 లక్షల 50వేలతో సెగ్రిగేషన్ షెడ్డు, రూ.3 లక్షలతో ఐదు గుంటల స్థలంలో పల్లె ప్రకృతి వనాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గ్రామంలో ప్రతి రోజూ చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్ నిరంతరం చక్కర్లు కొడుతూనే ఉంటుంది. చివరి మజిలీ కష్టాలు తీర్చేందుకు రూ.12 లక్షల 50 వేలతో వైకుంఠధామాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామంలో ప్రతి విద్యుత్ స్తంభానికి సోలార్ లైట్లు అమర్చడంతో చీకటి బాధలు తీరాయి. గ్రామ పంచాయతీ సిబ్బందితో ప్రతి రోజూ మురుగు కాల్వలను శుభ్రం చేయిస్తున్నారు.
‘ప్రగతి’కి దాతల చేయూత
గ్రామ అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావడం తో పనులు వేగంగా పూర్తయ్యాయి. పల్లె ప్రగతి కోసం 30 గుంటలు అప్పగించారు. గ్రామానికి చెందిన వొద్దుల పెద్దరాజిరెడ్డి, ఒద్దుల చంద్రారెడ్డి, మేడిపల్లి రామస్వామి, ఎక్కటి రాజిరెడ్డి తరుఫున వారి వారసులు ఈ స్థలాన్ని దానం చేశారు. ఇందులో పల్లె ప్రకృతి వనం కోసం 5గుంటలు, శ్మశానవాటికకు 12గుంటలు, కంపోస్ట్ షెడ్ కోసం 3గుంటలు, గ్రామ పంచాయతీ భవనం కోసం 10గుంటలను కేటా యించగా నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి.