తరలివచ్చిన భక్తజనం..కిక్కిరిసిన ఆలయం
ఘనంగా సేవా సమితి వార్షికోత్సవ వేడుకలు
బాసర, డిసెంబర్ 19: బాసర సరస్వతీ అమ్మవారిని భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో నిజామాబాద్, హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు.
శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి వార్షికోత్సవ వేడుకలు
బాసర శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆదివారం గిన్సిస్ వరల్డ్ రికార్డు గ్రహీత శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి 36వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఈవో వినోద్రెడ్డి, ఐ ఫౌండేషన్ చైర్మన్ రవీందర్, విద్యాదాత తిమ్మయ్య, సుభాష్రెడ్డి హాజరయ్యారు. ఆలయంలో టెంపుల్ డ్యాన్స్ పేరుతో మహా బృందం నృత్య ప్రదర్శనలను భక్తులు వీక్షించారు. చిన్నారులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. మొత్తం 125 మంది కళాకారులు, 25 మంది సంగీత విద్వాంసులు తమ ప్రదర్శనలతో పలువురిని ఆకట్టుకున్నారు. అనంతరం సేవా సమితి హోల్డర్ డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వకర్మ రాష్ట్ర అధ్యక్షుడు వేములవాడ మదన్మోహన్, డాక్టర్ సీతామహాలక్ష్మి, ప్రపంచ ప్రఖ్యాత నాట్య గురువు డాక్టర్ వెంపటి శ్రావణి, వరంగల్ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ పద్మజ పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
సరస్వతీ అమ్మవారిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి దర్శించుకున్నారు. బాసర చేరుకున్న వారికి ఆలయాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారిని శాలువాతో సన్మానించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యేల వెంట స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.