ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండోది
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల రైతులకు అందుబాటులోకి సేవలు
మూడేళ్లకోసారి పరీక్షలు చేసుకోవడం వల్ల నేల స్వభావం తెలుసుకునే వీలు
అందుకనుగుణంగా పంటలు వేసి లాభాల పొందవచ్చంటున్న శాస్త్రవేత్తలు
బెల్లంపల్లి రూరల్, డిసెంబర్ 19;బెల్లంపల్లి కృషి వ్యవసాయ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన భూసార పరీక్షా కేంద్రం రైతులకు వరంగా మారనున్నది. ఇది వరకు ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్లో మాత్రమే ఈ కేంద్రం ఉండగా, వ్యవసాయశాఖ తాజాగా బెల్లంపల్లిలోనూ ఏర్పాటు చేసింది. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల రైతులకు సేవలు అందుబాటులోకి రాగా, ప్రతి మూడేళ్లకోసారి మట్టి నమూనాలను పరీక్షించుకో వాలని సూచిస్తున్నది. ఈ విధానంతో నేలల స్వభావానికి అనుగుణంగా పంటలు వేసుకొని లాభాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బెల్లంపల్లి కృషి వ్యవసాయ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన భూసార పరీక్షా కేంద్రం రైతులకు వరంగా మారనున్నది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్లో మాత్రమే భూసార పరీక్షా కేంద్రం ఉండగా మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల రైతులకు అందుబాటులో ఉండేలా బెల్లంపల్లిలో కొత్తగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా జిల్లాలోని రైతులు ఎలాంటి భూసార పరీక్షలు చేయించుకోకుండానే యేటా పంటలు వేసుకునే పరిస్థితి ఉండేది. కేంద్రప్రభుత్వ అనుమతితో బెల్లంపల్లి ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని అందుబాటులోకి తేవడంతో రైతులకు సేవలు మరింత చేరువయ్యాయి. ప్రధానంగా గిరిజన ప్రాంతమైన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వ్యవసాయంలో సత్ఫలితాలు వస్తున్నాయి. గిరిజనులు, ఆదివాసులు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నారంటే కృషి విజ్ఞాన కేంద్రం నుంచి అందుతున్న వ్యవసాయ సలహాలు, సూచనలే కారణమని చెప్పాలి. వ్యవసాయంపై రైతులను మరింత చైతన్యవంతులుగా చేయడంలో భాగంగానే ఈ ప్రాంతంలో అదనంగా భూసార పరీక్షా కేంద్రాన్ని నెలకొల్పారు. రైతులు అందుబాటులో ఉన్న భూసార పరీక్షా కేంద్రాన్ని సద్వినియోగపర్చుకొని ప్రతీ మూడేళ్లకోసారి భూసార పరీక్షలు చేయించుకుంటే నేల స్వభావానికనుగుణంగా పెట్టుబడులు పెట్టి మంచి దిగుబడులనిచ్చే పంటలు వేసుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అందుబాటులోకి సేవలు
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల రైతులకు అందుబాటులోకి వ్యవసాయ పరిజ్ఞానా న్ని కృషి విజ్ఞానకేంద్రం తీసుకువచ్చింది. రైతులకు ఎళ్లవేళలా సేవలందించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు స్థానికంగా అందుబాటులో ఉండడం మరింత ప్రయోజనాలనిస్తుంది. దీనికి తోడు భూసార పరీక్షా కేంద్రం ఇక్కడికే రావడం ఈ ప్రాంతం రైతాంగానికి కలసివచ్చింది. భూసార పరీక్షా కేంద్రంలో మట్టి నమూనాలను పరీక్షించేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచారు. ల్యాబ్ అసిస్టెంట్ని కూడా నియమించారు. దీంతో పంట నేలల స్వభావాన్ని తెలుసుకునేందుకు రైతులు కూడా ముందుకు వస్తున్నారు. గతంలో నేలల్లో ఎలాంటి పరీక్షలు జరుపకుండానే పంటలు వేసుకోవడం వల్ల వ్యవసాయ ఖర్చులు పెరిగాయని, ఇప్పుడా పరిస్థితి నుంచి బయట పడేందుకు భూసార పరీక్షా కేంద్రం ఎంతగానో దోహదపడుతుందని ఇక్కడి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పండ్ల తోటలకు అనువైన నేలల్లో మట్టి నమూనాలు సేకరించే విధానం
పంటను బట్టి 3 నుంచి 6 అడుగుల (1-2 మీ లోతు)గుంట తవ్వి, ప్రతీ అడుగుకు కొంత మట్టిని సేకరించి భూసార పరీక్షకు పంపాలి. మట్టి నమూనాను తీసేటప్పుడు కింది లోతు నుంచి మట్టి నమూనాను తీయాలి. ఆ తర్వాత పై పొరల నుంచి మట్టిని సేకరిస్తే పై మట్టి కింది మట్టితో కలవకుండా ఉంటుంది. మట్టి నమూనా కోసం గుంట తవ్వుతున్నప్పుడు ఏవైనా గట్టి పొరలు ఉన్నట్లయితే వాటి లోతు, లక్షణాలపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. పండ్ల తోటల విషయంలో ఇలాంటి నమూనా సేకరణ ఎకరాకు 2-4 చోట్ల చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఇటువంటి నమూనాలను పరీక్ష కోసం పంపించేటప్పుడు రైతులు పండ్ల తోటల అనువైన పరీక్షల కోసం అని తెలియజేయాలి. నమూనాగా సేకరించిన మట్టిని బాగా నీడలో గాలికి ఆరబెట్టి మంచి ప్లాస్టిక్ బ్యాగులో గాని, గుడ్డ సంచిలో గాని నింపి భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి. మట్టి నమూనాలను రైతు పేరు, సర్వే నంబర్, గ్రామం, మండలం , కావలసిన పరీక్ష(భూసార, చౌడు, పండ్లతోటల ఎంపిక కోసం), ఇతర మునుపు పంట, దానికి వాడిన ఎరువులు, ప్రస్తుతం వేయబోయే పంట వివరాలను కాగితం పై తెలుపుతూ మట్టినమూనాలు పంపే బ్యాగుకు జత చేసి కేంద్రానికి అందించాలి.
మట్టి నమూనాలు సేకరించే విధానం
రైతులు తమ పొలంలో మట్టిని ప్రతీ మూడేళ్లకోసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. పొలంలో ‘వీ’ ఆకారంలో 15 సెం.మీ వరకు పారతో గుంట తీసి, అందులో పైపొర నుంచి కింది పొర వరకు ఒక పక్కన ఉన్న మట్టిని మాత్రమే సేకరించాలి. ఇలా సేకరించిన మట్టిలో రాళ్లు, రప్పలు, పంట వేర్ల మొదళ్లు లేకుండా చూసుకొని నీడలో ఆరబెట్టాలి. ఎకరం విస్తీర్ణంలో 8 నుంచి 10 చోట్ల సేకరించిన మట్టిని ఒకచోట చేర్చి బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులోని ఎదుటి భాగాలు తీసుకొని మిగతా భాగాలు తీసేయాలి. ఈ విధంగా 1/2 కిలోల మట్టి వచ్చే వరకు చేయాలి. గట్ల దగ్గర, పంట కాల్వల్లోని మట్టిని సేకరించరాదు. చెట్ల కిందనున్న పొలం భాగం నుంచి మంచి మట్టిని సేకరించరాదు. పశువుల పేడ, కంపోస్టు, వర్మీకంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువులు కుప్పలు పోసిన చోట మట్టిని సేకరించరాదు. ఎప్పుడు నీరు నిల్వ ఉండే పల్లపుప్రాంతంలోని మట్టిని సేకరించరాదు.
భూసార పరీక్షలతో సత్ఫలితాలు
భూసార పరీక్షలు చేయించు కోవడం వల్ల సత్ఫలితాలుం టాయి. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక పరీక్షా కేంద్రం ఉండడం వల్ల రైతులు భూసార పరీక్షలు చేయించుకోలేకపోయారు. మంచి ర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల రైతులకు అందుబాటులో ఉండే విధంగా బెల్లంపల్లి కేవీకేలో భూసార పరీక్షా కేంద్రా న్ని ఏర్పాటు చేశారు. రైతులు ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు పంట నష్టాన్ని తగ్గించి తక్కువ పెట్టుబడుల తో ఎక్కువ దిగుబడులు సాధించే ఉద్దేశంతో నే దీనిని అందుబాటు లోకి తీసుకొచ్చారు. ప్రతీ రైతు ముందస్తు ప్రణాళికతో సాగుకు శ్రీకారం చుడితే ఆర్థిక సుస్థిరత సాధించే అవకాశాలు అధికంగా ఉంటాయి.
భూసార పరీక్షల వల్ల లాభాలు
నేలలో సహజంగా ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన సేంద్రియ, రసాయనిక ఎరువుల్లోని పోషకాలు మొక్కలకి అంది పంటల దిగుబడులు పెరగడానికి తోడ్పడుతుంది. ఎరువుల వాడకంలో అనవసర ఖర్చులు లేకుండా భూసారాన్ని కాపాడుకుంటూ సుస్థిర దిగుబడులను పొందవచ్చు. మూడు సంవత్సరాలకోసారి భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల నేలలోని చౌడుగుణాన్ని, సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని సులభంగా గుర్తించవచ్చు. మట్టి నమూనాలను పరీక్షించి నేలలో ఉదజని సూచిక, లవణ సూచిక, సేంద్రియ కార్భనశాతం, లభ్యనత్రజని, లభ్యపొటాష్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. రైతులు రూ. 300 చెల్లిస్తే నేలలో ఉన్న వీటి వివరాలను నేరుగా పరీక్షలు జరిపి అందిస్తారు. వీటితో పాటుగా లభ్య సూక్ష్మపోషకాలు తెలుసుకోవడానికి పరీక్షల కోసం రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది.