పన్నుల వసూలుపై పంచాయతీ అధికారుల దృష్టి
ఈనెల 31లోగా వంద శాతం పూర్తి చేయాలని నిర్ణయం
నిర్మల్ జిల్లా లక్ష్యం రూ.6.17 కోట్లు
జీపీకో ప్రత్యేక టీం ఏర్పాటు
నిర్మల్ టౌన్, నవంబర్ 19 : నిర్మల్ జిల్లాలో గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లను వందశాతం పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం స్పెషల్ డ్రైవ్కు శ్రీకారం చుట్టింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ప్రతినెలా నిధులు కేటాయిస్తున్నది. పల్లెల అభివృద్ధిలో భాగస్వాములవుతున్నది. ఈ నేపథ్యంలో పల్లెల్లో చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులను వందశాతం వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 31లోపు పన్ను వసూళ్ల కోసం జిల్లాలోని 396 గ్రామ పంచాయతీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ భైంసాలో డీఎల్పీవో కృష్ణ, నిర్మల్లో శ్రీలత ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ శాఖ అధికారి వెంకటేశ్వర్రావు ఆదేశాల మేరకు పన్ను వసూళ్లను నెల రోజుల నుంచి చేపడుతున్నప్పటికీ ఆశించినస్థాయిలో ఫలితం రావడం లేదు. దీంతో ఇప్పుడు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
జిల్లాలో 396 జీపీలు..
నిర్మల్ జిల్లాలో మొత్తం 396 గ్రామపంచాయతీలున్నాయి. 1.49 లక్షల ఇళ్లున్నాయి. ఇంటి పన్నుకు సంబంధించిన బకాయిలు రూ.5.50 కోట్లు ఉండగా.. నాన్ టాక్స్ రూ.65 లక్షలున్నాయి. ఇప్పటివరకు నిర్మల్ జిల్లాలో ఇంటి పన్నులు రూ.2.19కోట్లు మాత్రమే వసూలు చేయగా.. ఇతర పన్నులు రూ.26.45 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. ఇంటి పన్నులు మొత్తం 39 శాతం వసూలు కాగా.. ఇతర పన్నులు 40 శాతం మాత్రమే వసూలు కావడంతో మిగిలిపోయిన పన్నులను ఈ నెల 31లోపు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. పన్నుయేతరల్లో లైసెన్సు ఫీజు, నీటి పన్ను, బంజరుదొడ్డి, అంగడి బజార్, వీధిదీపాలు వంటి వాటికి పన్నులు అధికంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
పన్ను వసూళ్లకు ప్రత్యేక టీంలు..
నిర్మల్ జిల్లాలో గ్రామ పంచాయతీకి సంబంధించి అన్ని రకాల పన్నులను వసూలు చేసేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఈ నెల 15 నుంచి 31 వరకు పక్షం రోజుల పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది వందశాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ప్రతిరోజూ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కార్యదర్శితో పాటు కారోబార్, ఇతర సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికెళ్లి బకాయిలుంటే తెలిపి వసూలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించాలని, చెల్లిస్తే జరిగే అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామాల్లో వీధివీధినా తిరుగుతూ డప్పు చాటింపు చేస్తూ పన్ను వసూలు చేస్తున్నారు.
ప్రజలు సహకరించాలి..
నిర్మల్ జిల్లాలో గ్రామ పంచాయతీకి సంబంధించిన ట్యాక్స్, నాన్ట్యాక్స్ను చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలి. నిర్మల్ జిల్లాలో మొత్తం రూ.6.17 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.2.45 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మిగిలిన పన్నులను ఈ నెల 31లోపు చెల్లించాలని అన్ని గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.