పుష్య పౌర్ణమి రోజున నువ్వుల నూనె తాగుతున్న తొడసం మహిళ
అనాధిగా కొనసాగుతున్న ఆచారం
నార్నూర్, జనవరి 19 : ఖాందేవ్ జాతర.. గిరిజనులు ఏటా పుష్యమాసం పౌర్ణమి రోజున ఘనంగా ప్రారంభిస్తారు.. ఈ జాతరకు శతాబ్దాల చరిత్ర ఉన్న ది. తొడసం వంశస్తులు సంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో ముఖ్య ఘట్టం ఏమిటంటే.. తొడసం వంశ ఆడబిడ్డ ఏండ్లుగా నువ్వు ల నూనె తాగడం.. అందులోనూ సుమారు రెండు కిలోల వరకు తాగడమంటే మాటలు కాదు.. ఇలా ఎందుకు తాగుతారని ఆరా తీస్తే.. తమ కులదైవంపై ఉన్న నమ్మకంతో సేవిస్తామని చెబుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో జరిగే ఖాందేవ్ జాతరకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ క్రీ.శ.1240-1262లో ఖాందేవుడు కొలువుదీరాడు. అప్పటి నుంచి ఏటా పుష్యమాసం పౌర్ణమి రోజున జాతర ప్రారంభమవుతుంది. ఆ రోజున తొడసం వంశస్తులు ఖాందేవ్ క్షేత్రంలో సంప్రదాయ పూజలు చేయడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. ఈ మహాపూజల మరుసటి రోజున ఆ వంశం ఆడబిడ్డ స్వచ్ఛమైన నువ్వుల నూనె తాగడం విశిష్టత. ఆ వంశానికి చెందిన.. పటేల్, కటోడా కుటుంబానికి చెందిన ఆడబిడ్డకు తైలం తాగించడం సంప్రదాయం. ఒక ఆడబిడ్డ వరుసగా మూడేండ్ల పాటు నువ్వుల నూనె తాగుతుంది. ఆ తర్వాత మరో మూడేండ్లు మరొకరికి అవకాశం కల్పిస్తారు. ఇలా ఆ వంశ ఆడబిడ్డనే శతాబ్దాలుగా నువ్వుల నూనె తాగుతూ వస్తున్నది. ఇక్కడ విశేషమేమంటే.. విశ్వశాంతిని కోరుతూ ఆ వంశ ఆడబిడ్డ సుమారు రెండు కిలోల శుద్ధమైన నువ్వుల తైలం తాగడం. నార్నూర్ మండలం బాబేఝరి చిత్తగూడ గ్రామానికి చెందిన జంగుబాయి-సోనేరావ్ దంపతుల ద్వితీయ కుమార్తె మడావి ఏత్మాబాయి ఈసారీ తైలం తాగింది. దీంతో ఈమె మూడేండ్లు పూర్తి చేసుకున్నది. ఈ విషయమై ఆమెను పలుకరిస్తే.. తమ వంశస్తులే ఏటా సుమారు రెండు కిలోల నూనె తాగుతామని, అంత తాగినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది. ఇదేమిటని అడుగగా.. ‘మా కులదేవుడిపై ఉన్న నమ్మకం.. అంతా ఖాందేవుడి మహిమా’ అంటున్నది. ఈ సారితో తన వంతు పూర్తయ్యిందని, వచ్చే ఏడాది మరొకరికి ఆ అవకాశం కల్పిస్తారని పేర్కొంటున్నది. కాగా.. పుష్యమాసంలో నెలవంక కనిపించిన మరుసటి రోజున వంశం పెద్దలు సమావేశమై ఎవరు తైలం తాగుతారో నిర్ణయిస్తారని ఆలయకమిటీ నిర్వాహకుడు తొడసం నాగోరావ్, పూజారులు(కటోడాలు) తొడసం బాపురావ్, తొడసం ఆనంద్రావ్ తెలిపారు.